
- ప్రాజెక్ట్ వద్ద ప్రతి ఏడాదీ ప్రమాదాలే...
- గతంలో కొట్టుకుపోయిన గేటు, ఊడిపడిన కౌంటర్ వెయిట్
- తాజాగా 8వ గేట్ రబ్బర్ సీల్ ఊడి వృథాగా పోతున్న నీరు
- ప్రాజెక్ట్కు బుంగ పడడంతో ఆందోళనలో ప్రజలు
సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలో సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక ప్రాజెక్టులు చేపడుతున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను మాత్రం గాలికొదిలేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్ట్గా పేరొందిన మూసీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోగా, తర్వాత కౌంటర్ వెయిట్ ఊడి కిందపడింది. ప్రస్తుతం ఓ గేట్ రబ్బర్ సీల్ ఊడిపోవడంతో నీరంతా వృథాగా పోతుండగా, మరో వైపు నుంచి ప్రాజెక్ట్కు బుంగ పడింది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రాజెక్ట్ పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేపర్లకే పరిమితమైన రూ.285 కోట్ల హామీ
మూసీ ప్రాజెక్ట్ పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ ఆధునికీకరణకు రూ. 285 కోట్లు కేటాయిస్తామని మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి 2016 డిసెంబర్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మాటలకే పరిమితమైంది తప్ప ఇప్పటివరకు ఎలాంటి ఫండ్స్ రిలీజ్ కాలేదు. ప్రధాన డ్యాం రిపేర్లకు ఆఫీసర్లు ప్రతిఏడాది ఎస్టిమేషన్లు పంపుతున్నా ప్రభుత్వం మాత్రం పైసలు విడుదల చేయడం లేదు. ప్రస్తుతం డ్యాం పరిస్థితి ప్రమాదరకంగా మారడంతో రిపేర్ల కోసం ఆఫీసర్లు మేలో రూ. 18 కోట్లతో మరోసారి ప్రపోజల్స్ పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి లేదు. 2018 నుంచి కనీసం మెయింటెనెన్స్ కోసం కూడా నిధులు ఇవ్వకపోవడంతో ఆఫీసర్లే జేబుల నుంచి ఖర్చు చేస్తున్నారు.
ప్రతి ఏడాది ప్రమాదాలే...
మూసీ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఫండ్స్ రిలీజ్ అయ్యేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్ట్ను పట్టించుకునేవారే కరువయ్యారు. కనీసం మెయింటెన్స్ కూడా ఇవ్వకపోవడంతో ప్రాజెక్ట్ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. 2019 అక్టోబర్లో గేటు కొట్టుకుపోగా, 2021లో కౌంటర్ వెయిట్ ఊడి ప్రాజెక్ట్లో పడిపోయింది. తాజాగా 8వ నంబర్ రెగ్యులేటరీ గేట్ రబ్బర్ సీల్ కొట్టుకుపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. ప్రాజెక్ట్కు ఓ వైపు బుంగ పడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ మెయింటెన్స్ చూసేందుకు కూడా సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నపైనే పనిభారం పడుతోంది. ప్రాజెక్ట్ వద్ద 20 మంది పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు.
ప్రపోజల్స్ పంపించాం
8వ నంబర్ రెగ్యులేటరీ గేట్ రబ్బర్ సీల్ కొట్టుకుపోవడంతో రిపేర్లు చేస్తున్నాం. ప్రాజెక్ట్ రిపేర్ల కోసం రూ. 18 కోట్లు అవసరం అని ఈ ఏడాది మేలో ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం. ఇంకా ఎలాంటి రిప్లై రాలేదు.
- చంద్రశేఖర్, డీఈ, మూసీ ప్రాజెక్ట్