
- బీజేపీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు
- పరిశీలనకు త్వరలో కమిటీ
- సెగ్మెంట్కు ముగ్గురి పేర్లు ఫైనల్ చేసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం బీజేపీ నేతలు అందజేసిన దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర పార్టీ త్వరలో స్క్రీనింగ్ కమిటీని నియమించనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నాయకుల నుంచి మొత్తం 6 వేల 3 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 4 నుంచి 10 వరకు దరఖాస్తులస్వీకరణ కొనసాగగా.. సీనియర్లు పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ సెకండ్ క్యాడర్ లీడర్లు పెద్ద సంఖ్యలో అప్లై చేసుకున్నారు. కాగా, అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను ముందుగా నియోజకవర్గాల వారీగా వేరు చేస్తారు.
ఆ తర్వాత వాటిని స్క్రీనింగ్ కమిటీ స్ర్కూట్నీ చేస్తుంది. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్లను ఫైనల్ చేసి హైకమాండ్ కు పంపిస్తుంది. అయితే, సీనియర్లు ఆప్లై చేసుకోకపోవడంతో చాలా చోట్ల దరఖాస్తుదారుల అవకాశాలను వారు దెబ్బతీసే చాన్స్ లేకపోలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టికెట్ విషయం ఎలా ఉన్నా.. వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీకి ఒక్కో నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో రెడీగా ఉన్నారనేది మాత్రం స్పష్టమవుతోంది. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి ఏకంగా 50 కి పైగా అప్లికేషన్లు వచ్చాయంటే సిటీ శివారు ప్రాంతాల్లో బీజేపీ టికెట్ కోసం పోటీ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.