- కరోనా విజృంభిస్తుండటంతో కేంద్రానికి సుప్రీం సూచనలు
- రాష్ట్రాలు రాజకీయాలు పక్కనబెట్టాలె.. పరిస్థితిని చూసి నడుచుకోవాలె
- జనం మాస్కులు వాడ్తలేరు.. కేర్లెస్గా ఉంటున్నరన్న కోర్టు
- గుజరాత్ రాజ్కోట్లోని కరోనా హాస్పిటల్లో అగ్నిప్రమాదంపై ఆరా
న్యూఢిల్లీ: ‘కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్. పరిస్థితి ఇంతకుముందు కన్నా తీవ్రమయ్యేలా ఉంది. కేవలం గైడ్లైన్స్ సరిపోవు. వైరస్ వ్యాపించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్రాలు కూడా రాజకీయాలు పక్కనబెట్టి పరిస్థితికి తగ్గట్టు నడుచుకోవాలంది. కరోనా బాధితులకు ట్రీట్మెంట్, మృతదేహాల నిర్వహణపై శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని బెంచ్ ఈ కామెంట్స్ చేసింది. ‘గ్రౌండ్ లెవెల్లో మాస్క్లు పెట్టుకోవడంలో జనం కేర్లెస్గా వ్యవహరిస్తున్నరు. 80% మంది మాస్కులు పెట్టుకోవట్లే. మిగతా వాళ్లు పెట్టుకున్నా దవడ కిందికి జరిపేస్తున్నరు. పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది. డిసెంబర్లో కేసులు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు కఠినంగా చర్యలు తీసుకోవాలి. అన్ని రాష్ట్రాల్లో రూల్స్ పాటించేలా కేంద్రం చూసుకోవాలి’ అని స్పష్టం చేసింది.
ప్రమాదాలు జరుగుతున్నా రాష్ట్రాలకు లెక్కలేదా?
గుజరాత్లోని రాజ్కోట్లో కరోనా ఆస్పత్రిలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు పేషెంట్లు చనిపోయిన ఘటనపైనా కోర్టు ఆరా తీసింది. ఆ ఘటనను తాము సుమోటాగా తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కరోనా ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదంది. అయినా రాష్ట్రాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. రాజ్కోట్ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం, కేంద్రం డిసెంబర్ 1 నాటికి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.
కంగనకు పరిహారం కట్టండి: బాంబే హైకోర్టు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు చెందిన ముంబైలోని ఆఫీసును బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) కూల్చివేయడాన్ని ముంబై హైకోర్టు తప్పుపట్టింది. చట్ట విరుద్ధంగా బిల్డింగును కూల్చేశారని బీఎంసీ అధికారులపై మండిపడింది. పిటిషనర్కు జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీరునూ కోర్టు తప్పుబట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతో పాటు ముంబైను పీవోకేతో పోల్చుతూ కంగన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రూల్స్కు వ్యతిరేకంగా కట్టారంటూ బీఎంసీ అధికారులు బాంద్రాలోని కంగన ఆఫీసులో కొంత భాగాన్ని కూల్చేశారు. దీనిపై కంగన ముంబై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. పిటిషన్పై వాదనలు విన్న కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కోర్టు నిర్ణయాన్ని ప్రజాస్వామ్యం గెలుపుగా కంగన కామెంట్ చేశారు.