పోలీస్ సెలక్షన్స్లో .. మోసగాళ్లతో జాగ్రత్త
బ్రోకర్స్ను పట్టిస్తే 3 లక్షలు: టీఎస్ఎల్పీఆర్బీ
హైదరాబాద్, వెలుగు : ఎస్ఐ, కానిస్టేబుల్స్ సెలెక్షన్ ప్రక్రియ తుది దశకు చేరడంతో తెలంగాణ స్టేట్లెవల్పోలీస్ రిక్రూట్మెంట్ బోర్ట్ (టీఎస్ఎల్పీఆర్బీ) అలర్ట్ అయ్యింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మోసం చేస్తారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బ్రోకర్ల సమాచారం ఇస్తే రూ.3 లక్షలు రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలు సీక్రెట్గా ఉంచుతామని తెలిపింది. ఈ మేరకు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు శనివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. జూన్ 14 నుంచి 26వ తేదీ వరకు 97,175 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసినట్లు వెల్లడించారు. వెరిఫికేషన్ పూర్తైయిన అభ్యర్థుల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని తెలిపారు.
నోటిఫికేషన్లో పేర్కొన్న ఏజ్ గ్రూప్ వారు మాత్రమే అర్హులు అవుతారని స్పష్టం చేశారు. కాగా, రిక్రూట్మెంట్ కీలక దశలో ఉన్నందున దళారులు, బ్రోకర్లు, మోసగాళ్లు అభ్యర్థులను ట్రాప్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్ని అర్హతలు సాధించిన అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తారని, ఫోన్ కాల్స్, మధ్యవర్తులతో మీటింగ్స్ నిర్వహిస్తుంటారని అన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, సెక్రటేరియెట్ ఉద్యోగులు తెలుసని, జాబ్ గ్యారంటీ అని ప్రచారం చేసుకునే వారిని నమ్మొద్దని చెప్పారు. జాయింట్ అకౌంట్స్లో డబ్బులు డిపాజిట్ చేయించి మోసం చేసే చాన్స్ ఉందన్నారు. అభ్యర్థులు సాధించిన అర్హతలతో సెలెక్ట్ అయినా.. తమ వల్లనే జాబ్ వచ్చిందని చెప్పుకుంటారని తెలిపారు. ఫేక్ వెబ్సైట్స్, ఈ–మెయిల్స్, సోషల్మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని హెచ్చరించారు.
