వాషింగ్టన్ : వాషింగ్టన్లోని భారత ఎంబసీ వద్ద హింసాత్మక చర్యలకు పాల్పడాలనే ఖలిస్తాన్ వేర్పాటువాదుల కుట్రను అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగంభగ్నం చేసింది. లండన్, శాన్ఫ్రాన్సిస్కో తరహా ఘటనలు పునరావృతం కాకుండా నిలువరించింది. శనివారం వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం ఎదుట సిక్కు వేర్పాటువాదులు పెద్దసంఖ్యలో ధర్నాకు దిగారు. ఈసందర్భంగా ఖలిస్తాన్ మద్దతుదారులు.. భారత్కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత ఎంబసీపై దాడి చేయాలని నిరసనకారులకు పిలుపునిచ్చారు. భారత్ లోనూ అలజడి సృష్టించాలని ఇంకొందరు రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ఈక్రమంలో పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో అమెరికా సీక్రెట్ సర్వీస్విభాగం రంగంలోకి దిగింది.
రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రభావితులైన ఐదుగురు నిరసనకారులు భారత ఎంబసీలోకి చొరబడేందుకు యత్నించారు. ఈక్రమంలో అక్కడే మఫ్టీలో ఉన్న అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది.. వారిని అడ్డుకొని వెనక్కి పంపించారు. నిరసన తెలిపే చోటును దాటి ముందుకొస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో నిరసనకారులు వెనక్కి తగ్గారు. వాషింగ్టన్ లో నిరసన జరిగిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న పార్కులో రెండు కట్టెల మోపులను తమ రిపోర్టర్ గుర్తించాడని భారత్కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఒక మోపులోని 20 కర్రలను ఖలిస్తాన్ జెండాలను కట్టడానికి వాడగా.. మరో దాన్ని పార్కులోనే పెట్టి వెళ్లారని పేర్కొంది.