తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన బిడ్డలకు రూపాయి ఇవ్వలేదు

 తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన బిడ్డలకు రూపాయి ఇవ్వలేదు
  • తెలంగాణను రాబందుల కుటుంబం దోచుకుంటోంది
  • కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ 

కరీంనగర్: తెలంగాణను రాబందుల కుటుంబం ఏడేళ్లుగా దోచుకుంటోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ కుల ప్రాతిపదికన మీటింగులు పెడుతూ ప్రజలను మభ్య పెడుతున్నాయి. సోమవారం హుజురాబాద్ వెంకటసాయి గార్డెన్ లో  కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ ముఖ్య పరిశీలకులుగా హాజరైన సమావేశంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించిన బిడ్డలకు రూపాయి ఇవ్వలేదు కానీ మంత్రులకు మాత్రం వేల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. 2009లో 5కోట్లతో బంజారాహిల్స్ లో జాగా కొన్న ఈటల ఈరోజు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? అని ఆయన ప్రశ్నించారు.

రబ్బర్ చెప్పులు వేసుకుని తిరిగిన నాయకులు ఈరోజు ఇన్ని వేల కోట్ల ఎలా సంపాదించారు ? అని ఆయన నిలదీశారు. దళితులను అన్నివిధాలుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపు ఓటములు కోసం కాదు... చివరి వరకు ఎంత నిజాయితీగా కష్టపడ్డాం అనేది ముఖ్యం అన్నారు. కార్యకర్తలు పార్టీకి గుండెకాయ లాంటి వారని, పార్టీయే పరమావధిగా భావిస్తూ పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి శాశ్వత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఆటుపోట్లు తప్పవని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు.