
ప్రపంచ ఆయుధ వ్యాపారం ఆధునిక జియో పాలిటిక్స్లో ఒక శక్తిమంతమైన ఆయుధంగా నిలిచింది. యుద్ధట్యాంకులు, డ్రోన్లు, యుద్ధవిమానాలు, క్షిపణులు లాంటివి నేడు బిలియన్ డాలర్ల విలువ కలిగిన పరిశ్రమల ఉత్పత్తులు. అంతర్జాతీయ సంబంధాలకు, వ్యూహాత్మక దౌత్యానికి కీలకంగా ఈ ఆయుధ వ్యాపారం మారింది. దాదాపుగా 600 బిలియన్ల డాలర్లకు పైగా మార్కెట్ విలువ కలిగి, ఇంకా రోజురోజుకూ పెరుగుతున్న ఆయుధ పరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన పరిశ్రమలలో ముఖ్యమైనది.
పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద కాంక్ష వివిధ రూపాలలో, అనేక సందర్భాలలో అంతర్జాతీయంగా వివిధ దేశాలను ప్రభావితం చేస్తోంది. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం, అంతర్జాతీయంగా డాలర్ ప్రాధాన్యతను తగ్గకుండా ఉంచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వివిధ దేశాల మధ్య ఉన్న సరిహద్దులు, దౌత్య సమస్యలను ఉసిగొలిపి, ఆయుధాలను అమ్ముకొని భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాకుండా ప్రపంచ దేశాలలో అమెరికానే అగ్రగామిగా ఉండేందుకు తెరవెనుక కుట్ర రాజకీయాలు చేస్తోంది.
అమెరికా ఆయుధాల అమ్మకాలలో ప్రపంచ మార్కెట్లలో దాదాపుగా 43% భాగాన్ని 2020-– 24 సంవత్సర మధ్యకాలంలో కలిగి ఉంది. ఇది 2000-2019 కాలంలో కేవలం 35 శాతంగా ఉండేది. ఇదే సమయంలో రష్యా మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 64% పైగా తగ్గిపోవడం జరిగింది. ఇంత భారీగా రష్యా ఎగుమతులు తగ్గిపోవడానికి కారణం అమెరికా రష్యాపై విధించిన ఆంక్షల ప్రభావం ఉంది.
రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోకుండా, అమెరికా ఆధిపత్యానికి గండి పడకుండా ఉండడం కోసం చేసిన ఎత్తుగడ ఇది. అమెరికా ప్రపంచ దేశాల్లో దాదాపుగా 70% ఆయుధాలను ఎగుమతి చేస్తే, ఆ తర్వాత స్థానంలో ఫ్రాన్స్ ఉంది. 2016 నుంచి 2020 వరకు యూఎన్ భద్రతామండలిలోని ఐదు స్థిర సభ్యులు (అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, యూకే) ప్రపంచంలో విక్రయించిన అన్ని ఆయుధాలలో దాదాపు 80% ఎగుమతి చేశాయి.
జర్మనీతో కలిపి ఈ దేశాలు ప్రధాన ఎగుమతిదారులు. సౌదీ అరేబియా అమెరికా నుంచి దాదాపు 80% ఆయుధాలను దిగుమతి చేసుకుంది. సౌదీ అరేబియాకు ఆయుధాల అమ్మకాలు ఒబామా, ట్రంప్ పాలనలలో గణనీయంగా పెరిగాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా 41 ప్రముఖ ఆయుధ తయారీదారుల్లో అమెరికా సంస్థలే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాయి.
టాప్ 5 యూఎస్ డిఫెన్స్ కంపెనీలు
అమెరికా టాప్ డిఫెన్స్ కంపెనీలు..1.లాక్హీడ్ మార్టిన్ 2.రేథియాన్ టెక్నాలజీస్ 3.బోయింగ్ డిఫెన్స్ 4.నార్త్రోప్ గ్రమ్మాన్ 5.జనరల్ డైనమిక్స్. ఇవి ప్రైవేటు సంస్థలు అయినా అమెరికా ప్రభుత్వం మార్గదర్శకత్వం, పర్యవేక్షణ, పటిష్టమైన నియంత్రణలోనే వ్యాపార ఉత్పత్తులు జరుగుతాయి. అన్ని దేశాలు తమ సొంత ఆయుధాలు, సైనిక సాంకేతికలను తయారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి, ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయటం లేదా సైనిక సహాయం పొందడం ద్వారా ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి.
అమెరికా ప్రపంచ ఆయుధాలు, సైనిక సాంకేతికతల ఎగుమతులలో అగ్రస్థానంలో ఉంది. 2020-–24లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధ దిగుమతి చేసుకున్న 10 దేశాల్లో భారత్, పాకిస్తాన్, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఉక్రెయిన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మిత్ర దేశాలు, ఆసియా-– పసిఫిక్ దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తూ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా స్థానాన్ని నిలుపుకుంది.
ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు, స్కార్పీన్ జలాంతర్గాములను భారత్ కొనుగోలు చేసింది. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు 100 రెట్లు పెరిగాయి. ఇది ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 8.8% పొందింది. అమెరికా, జర్మనీ, పోలాండ్ టాప్ సరఫరాదారులుగా ఉన్నాయి. రష్యా ప్రపంచ ఆయుధ ఎగుమతులు 64% క్షీణించి ప్రపంచ ఎగుమతుల్లో (మూడవ స్థానం) 7.8%కి పడిపోయాయి. అయినప్పటికీ, భారతదేశం (38%), చైనా (17%), కజకిస్తాన్ (11%) దాని మొదటి కొనుగోలుదారులుగా ఉన్నాయి.
ప్రపంచ సైనిక ఖర్చు 2.4 ట్రిలియన్ డాలర్లు2024లో ప్రపంచ సైనిక ఖర్చు 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరింది (ఇది 2023 కంటే 6.8% ఎక్కువ). ఉక్రెయిన్ సైనిక ఖర్చు 64 బిలియన్ డాలర్లు (దేశ ఆదాయంలో 37%). రష్యా యుద్ధంపై జీడీపీలో 6.7% ఖర్చు చేస్తోంది (ఆర్థిక ఒత్తిడి కలిగిస్తోంది).
చైనా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా సైనిక ఖర్చు పెంచాయి. స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2024 మిలిటరీ ఎక్స్పెండిచర్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ప్రపంచ దేశాలలో టాప్ ఐదు దేశాలలో మొదటి స్థానం పొందిన అమెరికా 916 బిలియన్ డాలర్లు సైనికుల కోసం ఖర్చు చేస్తోంది. ఇది దాదాపు ప్రపంచంలోని దేశాల మొత్తం సైనికులకు కోసం చేస్తున్న ఖర్చులో 38%. ఇంత భారీ మొత్తంలో ఖర్చుచేస్తూ వాటిపైన ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలపైన దృష్టిపెట్టి, దేశాల మధ్య అంతర్ యుద్ధాలకు పరోక్షంగా కారణం అవుతుంది.
చైనా సైతం 296 బిలియన్ డాలర్లు సైనిక ఖర్చుల కోసం చేస్తుండటం గమనించవచ్చు. అమెరికా కంటే మూడు రెట్లు తక్కువ అయినప్పటికీ, పెద్ద మొత్తంలోనే సైనిక ఖర్చుకు కేటాయింపు చేస్తోంది. రష్యా 109 బిలియన్ డాలర్లు తన సైన్యం కోసం ఖర్చు చేసింది. భారతదేశం సైతం 83.6 బిలియన్ డాలర్లు సైనిక శక్తి కోసం కోసం ఖర్చు చేస్తోంది. చైనా, పాకిస్తాన్తో ఉన్న టెన్షన్ల కారణంగా భారత్ ఖర్చు కూడా పెరిగి, ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత సౌదీ అరేబియా ఐదో స్థానంలో 75.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది. ఈ దేశం కూడా మిడిల్ ఈస్ట్ టెన్షన్ల కారణంగా అత్యధికంగా నిధులను ఖర్చు చేస్తోంది.
యుద్ధాలకు కారకులెవరు?
బ్రిటిష్ సామ్రాజ్యం నేరుగా రాజ్యాలపైన దాడులు చేసి ప్రజల సంపద దోచుకొని విరాజిల్లితే, అమెరికా పరోక్ష దాడులతో ప్రపంచాన్ని తన గుప్పిట ఉంచుకొని.. వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలను పీల్చేస్తున్నది. ఆయా దేశాలలో ఉండే బలహీనతలను ఆసరాగా చేసుకుని యుద్ధాలకి ఉసిగొల్పడంలో నేర్పరులు పాశ్చాత్య దేశాలవారు. అమెరికాతోపాటు నాటో, చైనా, రష్యా, ఫ్రాన్స్ కూడా అంతర్జాతీయ మార్కెట్లో యుద్ధ వాతావరణ పరిస్థితులకు కీలకంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా F-35 స్టెల్త్ జెట్లు, హిమర్స్ రాకెట్ సిస్టమ్స్, ఆధునిక డ్రోన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. 2024లో యుద్ధాలు, భద్రతా భయాల కారణంగా ప్రపంచం మరింత ఆయుధీకరణ వైపు సాగుతోంది.
ఆయుధాల వాణిజ్యం దేశాల భద్రతకు అవసరమేనా?
ప్రపంచ దేశాలు భారీగా నిధులు,మానవ ప్రతిభను సైనిక పటిష్టతకు ఉపయోగిస్తున్నాయి. ఆ వనరులు మానవ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే ప్రపంచ శాంతికి మార్గం సుగమం అవుతుంది. అంతర్జాతీయ సహకారం, ఆయుధ నియంత్రణ ఒప్పందాలు, టెక్నాలజీ- ఆధారిత ధృవీకరణ పద్దతులు అవసరం. సివిల్ సొసైటీ, యువత ఈ చర్చలలో పాల్గొనడం ముఖ్యం.
స్వయంచాలక ఆయుధాలు, ఏఐ ఉపయోగం వంటి వాటికి సరైన అంతర్జాతీయ నియమాలు లేవు. ఆయుధాల రంగంలో ఏఐ, ఆధునిక మిసైల్స్, స్వయంచాలక ఆయుధ వ్యవస్థలు వంటి అధునాతన సాంకేతికతలు విప్లవాత్మక మార్పులను తెస్తున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన తర్వాత దేశాలు ఒప్పందాలకు రావడం అనేక సందర్భాలలో కనపడుతున్నాయి. మానవ మనుగడ కోసం.. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న దశలో కీలక అంశాలపైన అంతర్జాతీయ సంస్థలను బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉన్నది.
అంతర్జాతీయ సంస్థల పనితీరు మెరుగుపరిచినట్లైతే ఆయుధాల వ్యాపారం తగ్గించడమే కాకుండా మానవ మనుగడకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. సైనిక ఖర్చు పెరగడం వల్ల ప్రపంచ శాంతి, స్థిరత్వం ప్రశ్నార్థకమవుతోంది. ఈ భారీ ఖర్చులతో దేశ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. సామాన్యులపైన పన్నుల భారం, వస్తు సేవల ధరల పెరుగుదలతో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి.
- చిట్టెడి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ-