భార్యకు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు

భార్యకు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు

తమిళనాడు : ఆనాడు షాజహాన్ తన భార్య ముంతాజ్ పై ప్రేమతో తాజ్ మహల్ కట్టించాడు. ఇప్పుడు ఓ భర్త చనిపోయిన తన భార్య పేరుమీద గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. ఆమెపై ఉన్న ప్రేమకు చిహ్నంగా హిందు సంప్రదాయంగా భార్య రూపంలో విగ్రహాన్ని పెట్టాడు.

వివరాలు :  చెన్నై, తాంబరం గ్రామానికి చెందిన రవి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడికి భార్య రేణుకతో 32 సంవత్సరాల క్రితం పెళ్లయ్యింది. భార్య అంటే రవికి అమితమైన ప్రేమ. వీరికి ఇద్దరు కుమారులు. అయితే అనారోగ్యంతో 2006లో రేణుక మృతిచెందారు. కష్ట సుఖాలను పంచుకునే భార్య దూరంకావడంతో రవి భరించలేక పోయాడు. ఆమెపై ఉన్న ప్రేమకు చిహ్నంగా చిరకాలం గుర్తుండేలా ఓ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్నుంచీ కష్టపడి ఆటో నడిపిన డబ్బులను ఆదా చేశాడు. ఆ డబ్బులతో ఇప్పుడు భార్య రూపంలో విగ్రహం పెట్టి పెద్ద గుడి కట్టిన రవి.. ప్రతి రోజు ఆలయంలో కొడుకులతో కలిసి రేణుక విగ్రహానికి పూజలు చేస్తున్నాడు.

ఇదే విషయంపై మాట్లాడిన రవి..భార్య అంటే భరించేదని..అందరినీ వదిలి భర్తే సర్వస్వం అనుకుంటుంది. అలాంటి భార్యలను ప్రతి మగాడు చక్కగా చూసుకోవాలని తెలిపాడు. తన భార్య ఇచ్చిన గడియారం ఇప్పటికీ పెట్టుకుంటానని తెలిపిన రవి..చొక్కా బటన్స్ లోనూ రేణుక ఫొటోలు పెట్టుకున్నానని తెలిపాడు. ఆడజన్మ అంటేనే అపురూపమైనదని..తన తల్లిలాగే భార్యను చూసుకున్నానని చెప్పుకొచ్చాడు ఈ అమరప్రేమికుడు..!