
ఈ ఏడాది కరోనా వైరస్ తో ప్రపంచదేశాలు వణికిపోయాయి. ముఖ్యంగా యూరప్ దేశాలకు సమస్యలు తప్పడం లేదు. చాలా దేశాల్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ వేవ్ లు కూడా నడుస్తున్నాయి. అమెరికాలో కేసుల సంఖ్యలో ఒకే వేవ్ నడుస్తోంది. అటు యూరప్ దేశాల్లో మళ్లీ ఆంక్షలు విధించే పరిస్థితి వచ్చింది. లాక్ డౌన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా చాలా మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన సందర్భాలూ ఉన్నాయి.
కరోనా వైరస్ తో చాలా దేశాల్లో ఈ ఏడాది వ్యాక్సినేషన్ చాలా వేగంగా జరిగింది. కొన్ని సంపన్న దేశాల దగ్గర టీకాలు ఉన్నా తీసుకునేందుకు అక్కడి జనం ముందుకు రాలేకపోయారు. దీంతో యూరప్ సహా చాలా దేశాల్లో కరోనా సెకండ్, థర్డ్, ఫోర్త్ వేవ్ ల ఎఫెక్ట్ కూడా కనిపించింది. కరోనా వైరస్ బ్రెజిల్, అమెరికాల్లో ఒక టైంలో తీవ్రస్థాయిలో వచ్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు నెమ్మదిస్తున్నాయి. అయితే సౌతాఫ్రికాలో గత నెల బయపడ్డ ఒమిక్రాన్ తో టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతోంది.
యూరప్ దేశాల్లో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. దీంతో హాలిడే సీజన్ పై ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. వాతావరణం మారుతుండడం, వ్యాక్సిన్లు తీసుకోని వారు ఎక్కువగా ఉండడంతో వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బ్రస్సెల్స్, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా వంటి దేశాల్లో పాక్షిక ఆంక్షలు కొనసాగుతున్నాయి. యూరప్ దేశాలు కరోనాకు ఎప్పటికప్పుడు ఎపిసెంటర్ గా మారుతూ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్త సగటులో కంటే యూరప్ లోనే మరణాలు ఎక్కువున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఇందులో వ్యాక్సిన్ తీసుకోని వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అంటున్నారు. కరోనా పెండమిక్ మొదలైన నాటి కంటే ఈ ఏడాదే యూరప్ లో ఎక్కువ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో హెల్త్ కేర్ సిస్టమ్ పై తీవ్ర ప్రభావమే పడుతోంది.
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, బ్రస్సెల్స్ వంటి దేశాలు వ్యాక్సినేషన్ ను కంపల్సరీ చేశాయి. అప్పటి వరకు కరోనా వ్యాక్సినేషన్ ఆప్షనల్ గానే ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 60% యూరప్ దేశాల నుంచే ఉంటున్నాయి. అమెరికా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఈ ఏడాది 6శాతం మేర పెరిగాయని WHO అంటోంది. రష్యాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గతంలో కంటే ఎక్కువగా కేసులు వస్తున్నాయి. అదే సమయంలో మొన్నటి దాకా రోజూ వెయ్యి వరకు మరణాలు సంభవించాయి. రష్యాలో ఇప్పటిదాకా కేవలం 40శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో టీకా డోస్ లు అందాయి. అందుకే వైరస్ విస్తరిస్తోందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
ఈ ఏడాది వ్యాక్సిన్ తీసుకోని వారికి చాలా ప్రదేశాల్లో ఎంట్రీని నిషేధించాయి పలు దేశాలు. దీంతో చాలా మంది అప్పటికప్పుడు వ్యాక్సిన్ కోసం ముందుకు వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనాను నియంత్రించేందుకు చాలా యూరప్ దేశాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లు తీసుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా రూల్స్ పెడుతున్నారు. అయితే ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా నెదర్లాండ్స్ సహా పలు దేశాల్లో జనం పెద్ద ఎత్తున రోడ్లెక్కారు. ప్రభుత్వాలు వ్యాక్సిన్ వేసుకున్న వారికే అన్ని చోట్లకు అనుమతి ఇవ్వడం, మిగితా వారిని ఇండ్లకే పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. కొన్ని యూరప్ దేశాల్లో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఒమిక్రాన్ చాలా దేశాలకు విస్తరించడంతో మరింతగా అలర్ట్ అవుతున్నారు.
స్లోవేకియాలో వ్యాక్సిన్ తీసుకోని వారికి పలు దుకాణాలు, మాల్స్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. వీరు ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి అనుమతి లేదు. అలాగే పనుల్లోకి వెళ్లాలంటే వారంలో రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న రూల్స్ పెట్టారు. గ్రీస్లోనూ టీకా తీసుకోనివారికి పలు నిబంధనలు అమలవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ టెన్షన్ తో ఇజ్రాయెల్ వంటి దేశాల్లో మరో బూస్టర్ డోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా చోట్ల బూస్టర్ డోస్ కు అనుమతులు ఇస్తున్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం.. 75 శాతం కోవిడ్-19 టీకాలు 10 దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయంటున్నారు. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంచనా ప్రకారం ఈ ఏడాది ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలు, అత్యంత పేద దేశాల కంటే 100 రెట్లు ఎక్కువగా టీకాలు వేశాయని చెబుతున్నారు.