
- చోరీల్లో కొత్త ఒరవడికి తెరలేపిన ముగ్గురు అరెస్ట్
- 77 ఫోన్లు, 2 బైక్ లు స్వాధీనం
- పరారీలో కొనుగోలు చేసిన వ్యక్తి
పద్మారావునగర్, వెలుగు: సెల్ఫోన్చోరీల్లో కొత్త ఒరవడికి తెరలేపారు ముగ్గురు వ్యక్తులు. బైక్పై వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయినట్లు నటిస్తారు.. రోడ్డుపై వెళ్తున్నవారు చూసి ఆగితే ఇక అంతే.. వారి పాకెట్ లో నుంచి ఫోన్ అపహరించి, ఉడాయిస్తారు. ఈ కొత్త తరహా దొంగతనాలకు చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మంగళవారం బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి బోయిన్ పల్లి పోలీస్స్టేషన్ లో వివరాలు వెల్లడించారు.
ఒడిశాలోని జైపూర్ జిల్లా పుర్బాకోట్ ప్రాంతానికి చెందిన గంట చిన్నా(40) ఉపాధి కోసం 2017లో నగరానికి వచ్చి, దిల్ సుఖ్ నగర్ లో ఉంటూ ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలో చేరాడు. తర్వాత తానే ముఠాను తయారు చేశాడు.
ఒడిశా నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చి, మల్లాపూర్లో నివాసం ఉంటున్న ప్రధాన్ శ్రీకాంత్(22), ఆవుల గోపీరావు(20)కు విషయం చెప్పాడు. ఫోన్లు చోరీ చేసి నగరంలో సెల్ ఫోన్షాపు నిర్వహిస్తున్న జాకీర్కు అమ్ముతున్నారు. అతను ఆ ఫోన్లను విదేశాల్లో విక్రయిస్తున్నాడు.
నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు..
ఈ నెల13న మధ్యాహ్నం బోడుప్పల్ పీర్జాదిగూడకు చెందిన కోల రాజనర్సింహ బోయిన్ పల్లి తాడ్ బండ్సిగ్నల్ దాటుతుండగా.. రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి బైక్తో సహా కిందపడి కనిపించాడు. అతనికి సాయం చేసేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న మరో వ్యక్తి గాయపడినట్లు నటిస్తూ రాజనర్సింహ వద్ద ఉన్న ఫోన్దొంగిలించాడు.
బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా 250 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫుటేజీల్లో ముగ్గురు వ్యక్తులు పలుమార్లు ఈ మార్గంలో బైక్లపై సంచరించినట్లు గుర్తించి నిఘా పెట్టారు. సోమవారం ఉదయం తాడ్ బండ్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నంబర్ప్లేట్ లేని 2 బైక్ లపై ముగ్గురు వ్యక్తులు స్పీడ్ గా వెళ్లారు. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
విచారణలో తాము చిన్నా, శ్రీకాంత్, గోపీరావు అని, సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద సుమారు రూ.25 లక్షల విలువైన 77 ఫోన్లు, 2 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై మియాపూర్, అత్తాపూర్, మేడ్చల్, బాచుపల్లి, చందానగర్, నార్సింగి పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీ కేసులున్నాయని చెప్పారు. ఫోన్లు కొనుగోలు చేసి, విక్రయిస్తున్న జాకీర్పరారీలో ఉన్నాడని తెలిపారు.