సీఎం తేలేది ఇవాళే.!..డిసైడ్ చేయనున్న సోనియా,ఖర్గే

సీఎం తేలేది ఇవాళే.!..డిసైడ్ చేయనున్న సోనియా,ఖర్గే
  • డిసైడ్​ చేయనున్న సోనియాగాంధీ, ఖర్గే
  • సీఎల్పీ భేటీలో అభిప్రాయాలు తీసుకున్న అబ్జర్వర్లు
  • ఏకవాక్య తీర్మానం చేసిన ఎమ్మెల్యేలు
  • సీల్డ్​ కవర్​లో హైకమాండ్​కు చేరిన ఒపీనియన్స్​
  • సోమవారం రాత్రే ప్రమాణం ఉంటుందన్న ప్రచారంతో 
  • రాజ్​భవన్​లో ఏర్పాట్లు.. సీఎం కోసం కొత్త కాన్వాయ్​ రెడీ
  • మళ్లీ ఒక్కో ఎమ్మెల్యేను పిలిచి అభిప్రాయాలు రికార్డ్​ చేసిన అబ్జర్వర్లు.. అనంతరం ఢిల్లీకి పయనం  
  • నేడు సోనియా, ఖర్గేతో భేటీ.. అక్కడే ఫైనల్

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ సీఎం అభ్యర్థిని మంగళవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాలను రికార్డ్​ చేసుకొని ఏఐసీసీ అబ్జర్వర్లు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశం అనంతరం సీఎం ఎవరనేదానిపై క్లారిటీ వచ్చే చాన్స్​ ఉంది.  ఆదివారం అభ్యర్థులు గెలవగానే అదే రోజు వారందరినీ హైదరాబాద్​లోని హోటల్​ ఎల్లాకు తరలించారు. అక్కడే సోమవారం ఏఐసీసీ అబ్జర్వర్​ డీకే శివకుమార్​ నేతృత్వంలో సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు.

ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను ఏఐసీసీ అబ్జర్వర్లు రికార్డ్​ చేశారు. అభ్యర్థులంతా కలిసి ఏకవాక్య తీర్మానం చేశారు. హైకమాండ్​ చెప్పినోళ్లు ఎవరైనా తమకు సీఎంగా ఓకే అంటూ తీర్మానాన్ని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ప్రవేశపెట్టగా.. దాన్ని భట్టి విక్రమార్క, సీతక్క, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యేలు బలపరిచారు. దాన్నే సీల్డ్​ కవర్​లో హైకమాండ్​కు డీకే శివకుమార్​ పంపించారు. రెండు గంటల్లోనే నిర్ణయం వెలువడుతుందని డీకే శివకుమార్​ ప్రకటించారు. సోమవారం రాత్రే సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణం ఉంటుందన్న ప్రచారమూ జరిగింది.

అందుకు తగ్గట్టు  ప్రమాణస్వీకారానికి రాజ్​భవన్​లో కూడా ఏర్పాట్లు చేశారు. కానీ, సాయంత్రం దాటినా హైకమాండ్​ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు హైకమాండ్​ ఆదేశాలతో ఏఐసీసీ అబ్జర్వర్లు ఒక్కొక్క ఎమ్మెల్యేను పిలిచి సీఎం అభ్యర్థిపై అభిప్రాయాలను తీసుకున్నారు. 

వారు చెప్పిన అభిప్రాయాలను డీకే శివకుమార్​ రికార్డ్​ చేసుకున్నారు. కాగా, సీఎల్పీ సమావేశం ప్రారంభం కావడానికి ముందు డీకే శివకుమార్​తో భట్టి విక్రమార్క, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, శ్రీధర్​బాబు సమావేశమైనట్టు తెలిసింది. 

ఢిల్లీకి వెళ్లిన నలుగురు అబ్జర్వర్లు..ఇయ్యాల డీకే కూడా..!

సీఎం అభ్యర్థిని సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే డిసైడ్​ చేయనున్నారు. మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్లు డీకే శివకుమార్, దీపాదాస్​ మున్షి, అజయ్​ కుమార్​, కె. మురళీధరన్​, కె.జె. జార్జ్​..  సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. వాస్తవానికి సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్​ను నిర్వహించగా.. ఆ సమావేశంలోనే సీఎం క్యాండిడేట్​ను సోనియా గాంధీ ప్రకటించే అవకాశం ఉందని చర్చ జరిగింది. కానీ, ఆ సమావేశంలోనూ సోనియా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

ఈ నేపథ్యంలోనే నలుగురు ఏఐసీసీ అబ్జర్వర్లు సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరారు. డీకే శివకుమార్​ మాత్రం బెంగళూరుకు వెళ్లినట్టు తెలిసింది. అక్కడి నుంచి మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాల సమాచారం. సోనియా, ఖర్గేతో సమావేశం తర్వాత సీఎం అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని, మంగళవారం ప్రకటన వచ్చేందుకు చాన్స్​ ఉంటుందని పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు పలువురు సీనియర్​ నేతలూ ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

హైకమాండ్​ నుంచి వచ్చే ప్రకటనను బట్టి మరో రెండు మూడు రోజుల్లో సీఎం ప్రమాణం ఉండే అవకాశం ఉంటుందని, లేదంటే ఈ నెల 9న జరిగే అవకాశం ఉందని ఓ ఎమ్మెల్యే చెప్పారు. సీఎంతో పాటు నలుగురు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేసే చాన్స్​ ఉందంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కాని నేతలంతా హోటల్​ ఎల్లా నుంచి వెళ్లిపోవాల్సిందిగా హైకమాండ్​ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలంతా క్యాంప్​లోనే ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. సీఎల్పీ నేత ఎన్నిక ఆలస్యమైతే వారిని బెంగళూరు క్యాంప్​కు తరలించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

హోటల్​ వద్ద సందడి

ఎమ్మెల్యేల క్యాంప్​ను ఏర్పాటు చేసిన హోటల్​ ఎల్లా వద్ద సోమవారం ఉదయం నుంచి సందడి వాతావరణం నెలకొంది. సీఎల్పీ నేతను ఎన్నుకునే సమావేశం కావడంతో నేషనల్​ మీడియా కూడా భారీగా అక్కడికి చేరుకుంది. ఇటు హోటల్​కు నేతల తాకిడి కూడా పెరిగింది. చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకు హోటల్​ వద్దకు చేరుకున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. కొందరు లీడర్లు తమకు తెలిసిన పెద్ద స్థాయి లీడర్లతో చెప్పించుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

మరోవైపు హోటల్​ వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎంకు భద్రత కల్పించే టీఎస్​ఎస్​పీ సిబ్బందితో పాటు సివిల్​ పోలీసులనూ భారీగా మోహరించారు. మరోవైపు డీకే శివకుమార్​ మీడియాతో మాట్లాడేందుకు వచ్చినప్పుడు.. అక్కడ స్వల్ప తొక్కిసలాట లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీడియా ఎక్కువగా చేరుకోవడం, కాంగ్రెస్​ పార్టీ నేతలూ పెద్ద సంఖ్యలో అక్కడికి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు కెమెరామెన్లు కింద పడిపోయారు. 

రాజ్​భవన్​లో ఏర్పాట్లు

సోమవారం ఓవైపు సీఎల్పీ సమావేశం జరుగుతుండడం, సీఎం అభ్యర్థి ఎవరన్నది కొద్ది గంటల్లోనే తేలుతుందన్న చర్చల నేపథ్యంలో.. రాజ్​భవన్​లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం నుంచే రాజ్​భవన్​ వద్ద కొంత హడావుడి కనిపించింది. రాత్రి 8.30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలున్నాయన్న కథనాలతో  జనరల్​ అడ్మినిస్ట్రేషన్​ డిపార్ట్​మెంట్​ చకచకా ఏర్పాట్లను పూర్తి చేసింది. రాజ్​భవన్​లోని దర్బార్​ హాల్​లో 175 మందికి సరిపోయేలా చైర్లు వేశారు. స్టేజీని ఏర్పాటు చేసి డెకరేషన్​ కూడా చేయించారు. కానీ, చివరి నిమిషంలో సీఎం అభ్యర్థి ఎంపిక లేట్​ కావడంతో ఆ ఏర్పాట్లను ఆపేశారు. అక్కడి నుంచి అందరినీ పంపించేశారు.  

సీఎం కోసం కొత్త కాన్వాయ్​

కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్​ను కూడా రాజ్​భవన్​ వద్ద అధికారులు రెడీ చేసి పెట్టారు. ఆరు తెలుపు ఇన్నోవా కార్లను రాజ్​భవన్​ పక్కన ఉన్న దిల్​కుషా గెస్ట్​ హౌస్​ వద్ద సిద్ధం చేశారు. సీఎం ప్రమాణం పూర్తికాగానే ప్రొటోకాల్​ ప్రకారం అధికారులు కొత్త కాన్వాయ్​ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ముందుగానే కాన్వాయ్​ను సిద్ధం చేసినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి సీఎంగా కేసీఆర్​ కాన్వాయ్​లో ల్యాండ్​క్రూజర్​ కార్లుండేవి. ఆల్​ సిక్స్​ల నంబర్లతో కూడిన కార్లను కేసీఆర్​ ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. ప్రస్తుతం సీఎం ప్రమాణ స్వీకారానికి మాత్రం ఇన్నోవా కార్లను ఏర్పాటు చేశారు.