మరో 3 లేదా 4 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం సాయంత్రం (మే 6వ తేదీన) తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మే 6వ తేదీ ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 8వ తేదీన ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశముందని, ఇది మరుసటి రోజున వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వాయుగుండం ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తీవ్రమై తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల శనివారం (మే 6న) సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కేపీహెచ్బీ, హైదర్నగర్, నిజాంపేట, ప్రగతినగర్, కూకట్పల్లి, దుండిగల్, మల్లంపేట్, గండి మైసమ్మ, సూరారం, గాగిల్లాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, మదీనాగూడ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.