
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చి 24వ తేదీన విద్యార్థులు నిరుద్యోగ మార్చ్, నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. నిరుద్యోగ దీక్షకు రాజకీయ నేతలను విద్యార్థులు ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లను పిలిచారు.
పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మార్చి 24, 25వ తేదీల్లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకు విద్యార్థులు పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ బాధ్యులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థులు పట్టుపడుతున్నారు. న్యాయపరంగా తాము పోరాటం చేస్తుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడమేంటంటని ప్రశ్నిస్తున్నారు. అటు క్యాంపస్ కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేశారు. ఎవరిని లోపలికి అనుమతించడంలేదు.
అటు నిర్యుద్యోగ మార్చ్కు విద్యార్థి సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఓయూ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు. దీక్షకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు క్యాంపస్ లో హై అలెర్ట్ను ప్రకటించారు.
యూనివర్సీటీ చుట్టూ భారీగా మోహరించారు పోలీసులు. క్యాంపస్ లోని స్టూడెంట్స్ బయటకు రాకుండా.. బయట నుంచి స్టూడెంట్స్, ఇతర పార్టీల నేతలు లోపలికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. అత్యవసరం అయితేనే పంపిస్తామని తెగేసి చెబుతున్నారు పోలీసులు. దీనికితోడు విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగానే అరెస్టులు చేస్తున్నారు. గృహ నిర్బంధం చేస్తున్నారు పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే అన్ని రహదారుల్లోనూ పోలీసులు భారీగా ఉన్నారు. ఎవర్నీ అటువైపు వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.