శ్రీవిష్ణు, కయ్యదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘అల్లూరి’. ఈ నెల 23న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘అల్లూరి’ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. శ్రీవిష్ణు ప్రతి సినిమాను ఫాలో అవుతున్నాను. తన చిత్రాల్లో కొత్తదనం ఉంటుంది. చాలా డెడికేటెడ్గా పనిచేస్తాడు. అందుకే సక్సెస్,ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా తనపై రెస్పెక్ట్ అలాగే ఉంది. తన ప్రతి సినిమా సక్సెస్ కావాలని, ఇలాంటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ప్యాండమిక్ తర్వాత చిన్న సినిమా, పెద్ద సినిమా అనే ఫార్ములాలు లేవు. ఇప్పుడున్న ట్రెండ్ ఒకటే. కంటెంట్ బాగున్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అని చెప్పాడు. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఐదేళ్లుగా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాం. ఎంత ఎఫెర్ట్ పెట్టాలో అంతా పెట్టాను. ఒక పోలీస్ ఇరవై ఏళ్ల జీవితాన్ని చూపిస్తున్నాం. ఇందులోవన్ని కల్పిత పాత్రలే. కానీ ఇన్సిడెంట్స్ అన్నీ నిజంగా జరిగినవే. పోలీస్ వ్యవస్థ మనకు చాలా చేసింది.
వాళ్లు కనిపిస్తే సెల్యూట్ చేసేలా ఈ సినిమా చేశా. ఇక నా ఫస్ట్ మూవీ తర్వాత బన్నీ పిలిపించి.. కంటెంట్ ఉన్న సినిమాలే చేయమని ప్రోత్సహించారు. ఆయన చెప్పిందే ఫాలో అవుతున్నా’ అన్నాడు. ‘పోలీస్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అనే డైలాగ్ ఆధారంగానే ఈ స్ర్కిప్ట్ మొత్తం రాశాను. నిజాయితీగా ఉన్న పోలీస్ వ్యవస్థ రియల్ లైఫ్లో ఏం చేసిందనేది ఓ వ్యక్తి బయోపిక్ రూపంలో చూపించాం. విష్ణు నాలుగు వేరియేషన్స్లో కనిపిస్తాడు’ అని చెప్పాడు ప్రదీప్ వర్మ. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘షూటింగ్ మధ్యలో ఎన్ని చాలెంజ్లు వచ్చినా ఎక్కడా రాజీపడకుండా తీశాం. సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్స్ చాలా బాగుందని చెప్పడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, దర్శకులు అజయ్ కుమార్, ప్రశాంత్ వర్మ, తేజ మార్ని, శ్రీ హర్ష కొనుగంటి మూవీ టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ హర్ష వర్ధన్ రామేశ్వర్, లిరిక్ రైటర్ రాంబాబు గోసల, ఆర్ట్ డైరెక్టర్ విఠల్, డీవోపీ రాజ్ తోట, కో ప్రొడ్యూసర్ నాగార్జున వడ్డే తదితరులు పాల్గొన్నారు.