
హైదరాబాద్ బోరబండలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయాన్ని అద్దెకు తీసుకొని ఏడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి ఓనర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో కార్యాలయాన్ని ఓనర్ ఖాళీ చేయిస్తుండగా కార్పోరేటర్ బాబా సహా అతని అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనాస్థలికి పోలీసులు రావడంతో బాబా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల సాయంతో ఓనర్ వారిని ఖాళీ చేయించారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఏడేళ్ల క్రితం తన ఇంటిని బాబా ఫసియుద్దీన్ అద్దెకు తీసుకున్నట్లు ఇంటి ఓనర్ తెలిపారు. చాలా రోజుల నుంచి అద్దె అడుగుతున్నా..ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. దీంతో కోర్టును ఆశ్రయించానని తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలతో వారిని ఖాళీ చేయాలని అడిగితే దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.