వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంటు చార్జీల పెంపు లేదు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంటు చార్జీల పెంపు లేదు
  • ప్రస్తుత టారిఫ్ ఆర్డరే వర్తిస్తుంది 
  • డిస్కంల ట్రూ అప్స్.. సర్కారే చెల్లిస్తుంది
  • ఐదేండ్లలో రూ. 12,718 కోట్లు చెల్లిస్తామని సర్కార్ లేఖ 
  • టారిఫ్ ఆర్డర్ ప్రకటించిన ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ టారిఫ్ ఆర్డర్లలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ్ ఆర్డరే 2023–-24 ఆర్థిక సంవత్సరానికి కూడా వర్తించనుంది. ప్రార్థనా స్థలాలకు మాత్రమే గతంలో అధికంగా ఉన్న కరెంటు చార్జీలను లోడ్​తో సంబంధం లేకుండా యూనిట్ సరాసరి ధరను రూ.5గా నిర్ణయించారు. ఇంతకు మించి వచ్చే ఆర్థిక సంవత్సరం టారిఫ్ ఆర్డర్లో ఎలాంటి మార్పు లేదు. 2022–-23లో కరెంటు చార్జీలు పెంచిన విద్యుత్ సంస్థలు 2023–-24లో చార్జీల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. ప్రస్తుత టారిఫ్ ఆర్డర్ నే యథాతథంగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ ఈఆర్సీ) ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం సింగరేణి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈఆర్సీ చైర్మన్ టి. శ్రీరంగారావు, సభ్యులు మనోహరరాజు (టెక్నికల్), బండారు కృష్ణయ్య ప్రకటించారు. 2023-–24 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయ లోటు రూ. 10,990.51 కోట్లు ఉంటుందని వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనల్లో (ఏఆర్ఆర్) పేర్కొన్నారు. దాన్ని పరిశీలించిన కమిషన్ ఆదాయ లోటు రూ.9,124.82 కోట్లుగా ఉంటుందని నిర్ధారించి ఆమోదించింది. అలాగే విద్యుత్ కొనుగోలు ధరను 2022-–23లో యూనిట్ కు రూ.4.49 పైసలుగా నిర్ణయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.4.39 పైసలుగా ప్రకటించారు. కాస్ట్ ఆఫ్ సర్వీస్ కూడా రూ.7.03 పైసల నుంచి రూ.7.02 పైసలుగా నిర్ధారించారు. 2023–-24లో రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.9,124.82 కోట్ల సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. దీన్ని టీఎస్ ఈఆర్సీ టారిఫ్ ఆర్డర్లో పరిగణనలోకి తీసుకుంది.  

ట్రూ అప్స్ భారం సర్కారుకే  

వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీలు వసూలు చేసుకొనేందుకు అనుమతించాలని డిస్కంలు టీఎస్ఈఆర్సీకి గతంలో దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన కమిషన్ ఆ చార్జీలను రూ.12,718.40 కోట్లకు ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని ఐదేండ్లలో దశలవారీగా విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఈఆర్సీకి లేఖ రాసింది. దీనితో ఈ భారం నేరుగా విద్యుత్ వినియోగదారులపై పడలేదు. ఎన్నికల సంవత్సరం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కరెంటు చార్జీలు పెరగకుండా జాగ్రత్త పడింది. ఇక 2016–-17 నుంచి 2022-–23 వరకు మొత్తం ఏడేండ్ల విద్యుత్ కొనుగోలు ట్రూ అప్ చార్జీలు రూ.12,514.57 కోట్లకు కమిషన్ ఆమోదం తెలిపింది. అలాగే 2006–-07 నుంచి -2018-–19 వరకు విద్యుత్ పంపిణీ వ్యాపార వీలింగ్ చార్జీల ట్రూ అప్ పేరుతో డిస్కంలు రూ.4,578.41 కోట్లను క్లెయిమ్ చేశాయి. దీనిలో కూడా ఉదయ్ స్కీం ద్వారా లభించిన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని రూ.203.83 కోట్లకు మాత్రమే టీఎస్ఈఆర్సీ ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.12,718.40 కోట్లు ట్రూ అప్ చార్జీలను కమిషన్ ఆమోదించింది. ఈ సొమ్మును ఐదేండ్లలో డిస్కంలకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కు లేఖ రాయడంతో దాన్ని పరిగణనలోకి తీసుకొని, వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం వేయలేదని కమిషన్ చైర్మన్ వివరించారు.