దొంగతనం చేయడం ఎంత కష్టమో తెలుసా?: దొంగ లేఖ

దొంగతనం చేయడం ఎంత కష్టమో తెలుసా?: దొంగ లేఖ

చెన్నై: తాను దొంగతనం చేయబోయిన చోట ఒక్క పైసా కూడా దొరక్కపోవడంతో ఓ దొంగకు ఒళ్లు మండింది. ఆవేశంతో తాను దొంగతనానికి ప్రయత్నించిన షాపు ఓనర్ కు ఓ లెటర్ రాసి తన కోపాన్నంతా వెళ్లగక్కాడు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా మందారకుప్పంలో జరిగింది.

ఆ గ్రామానికి చెందిన జయరామన్‌ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆ ఏరియాలో అదే ఫేమస్ షాప్ అని గుర్తించిన ఆ దొంగ గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పై కప్పును తొలగించి లోపలికి వెళ్లాడు.  కౌంటర్ దగ్గరకు చేరుకొని గల్లా పెట్టే తెరవగా.. అందులో ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక వెనుదిరిగాడు

ఉదయాన్నే షాపు తెరచిన జయరామన్‌ షాపు  పైకప్పు దెబ్బతినడం చూసి షాకయ్యాడు.  ఏదో దొంగతనం జరిగి ఉంటుందని గ్రహించి షాపు అంతా కలియజూస్తుండగా ఓ లేఖని గుర్తించాడు.  ఆ లెటర్ లో..” ప్రాణాలను పణంగా పెట్టి అతి కష్టం మీద దొంగతనానికి వస్తే గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టవా? దొంగతనం చేయడం అంత సులువు అనుకుంటున్నావా.? ఆ పని చేయడానికి ఎంతో కష్టపడాలి. డబ్బులే లేని ఈ షాపులో పప్పుదినుసులను పట్టుకెళ్లి నేనేం చేసుకోవాలంటూ”  రాశాడు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు.