శోభాయాత్రలో దొంగల హల్‌చల్.. మంగళ్‌హాట్ పీఎస్‌లో 35 ఫిర్యాదులు

శోభాయాత్రలో దొంగల హల్‌చల్.. మంగళ్‌హాట్ పీఎస్‌లో 35 ఫిర్యాదులు

రామనవమి సందర్భంగా భాగ్యనగర్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ధూల్‌పేట్‌ సీతారాంబాగ్‌ నుంచి కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు ఈ యాత్ర సాగనుంది. శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు దొంగల బెడద తప్పడం లేదు. 

శ్రీరాముని శోభాయాత్రలో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భక్తుల ఫోన్లు, పర్సులు, మెడలో చైన్లు దోచేస్తున్నారు. అలానే ఓ దొంగ మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ తెంపుతుండగా తోటి భక్తులు పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలపై మంగళ్‌హాట్ పీఎస్‌లో ఇప్పటికే 35 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దొంగల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.