తిరుపతి: తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది, సోమవారాల్లో జరుగనున్న గజ, గరుడ వాహనసేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు.
తిరుమలలో జరిగిన కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. తిరుపతి జెఈవో పి.బసంత్ కుమార్కు అందజేశారు. అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, శ్రీవారి ఆలయ ఓఎస్డి పాల శేషాద్రి, పేష్కార్ జగన్మోహనాచార్యులు, ఏఈవో సుబ్రమణ్యం, ఏవిఎస్వోలు గంగరాజు, చిరంజీవి ఇతర అధికారులు పాల్గొన్నారు.