ఫిబ్రవరి 15న (ఆదివారం) కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్-పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉంది. శ్రీలంక వాతావరణ శాఖ ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం 93% వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, సాయంత్రానికి అది తగ్గే అవకాశం ఉంది. అయితే, వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే, రెండు జట్లకు చెరో పాయింట్ లభించి సూపర్-8కు అర్హత సాధిస్తాయి.
దీనివల్ల అమెరికా, నెదర్లాండ్స్ జట్లకు నష్టం జరుగుతుంది. కొలంబోలో ఫిబ్రవరి 15న వర్షం కురిసే అవకాశాలు ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం కేవలం 13 శాతం మాత్రమే ఉందని AccuWeather తెలిపింది. ఎలాగూ.. ఇండియా, పాక్ మ్యాచ్ సాయంత్రం 6 తర్వాతే కాబట్టి దాదాపు వర్షం పడే అవకాశాలు తక్కువనే చెప్పాలి. కాకపోతే.. రాత్రి 11 గంటల వరకూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని AccuWeather పేర్కొంది.
ఒకవేళ.. సాయంత్రం 7 గంటల సమయంలో వర్షం కురిసినా మ్యాచ్ ఆలస్యం అవుతుందే తప్ప రద్దయ్యే ఛాన్స్ లేదు. రాత్రి 10 గంటల వరకూ అంపైర్లు పరిస్థితి చూస్తారు. అప్పటికి వర్షం తగ్గితే చెరో 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. అప్పటికీ వర్షం తగ్గకుండా కంటిన్యూగా వాన పడుతుంటే అప్పుడు మ్యాచ్ క్యాన్సిల్ చేసి చెరో పాయింట్ ఇస్తారు.
ఇదిలా ఉండగా.. పాక్పై టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో టీమిండియాకు తిరుగు లేని రికార్డ్ ఉంది. ఎనిమిది మ్యాచులు జరిగితే ఏడు మ్యాచుల్లో టీమిండియానే ఘన విజయం సాధించింది. 2021లో జరిగిన మ్యాచ్లో మాత్రమే పాకిస్తాన్ జట్టు టీమిండియాపై గెలిచింది.
