ఈ రోజుల్లో అందరి నోళ్లలోనూ నానుతున్న మాట ఏదన్నా ఉందంటే.. అది టమాటాలు, టమాటా ధరలు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దేశ వ్యాప్తంగా వందల్లో పలుకుతోన్న వీటి ధర ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ కిచెన్ లో కీలకమైన పాత్ర పోషించే టమాటాల ధర ఇప్పుడు ఆల్-టైమ్ హై లెవల్ కు చేరుకుంది.
వ్యాపారాలు తమ పోటీదారుల మధ్య నిలదొక్కుకోవడానికి వినూత్న ప్రమోషన్లను ఆశ్రయించడమే కాకుండా, ఉచితంగా టమాటాలు అంటూ కస్టమర్లను ఆకర్షించడానికి చిన్న వ్యాపారాలు ప్రత్యేకమైన పథకాలతో ముందుకు వస్తున్నాయి. ఇంత ధర పెట్టి టమాటాలను కొనేదెలాగా అని ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తుంటే.., చండీగఢ్లోని ఒక ఆటో-రిక్షా డ్రైవర్ మాత్రం ఉచితంగా టమటాలు ఇస్తున్నాడు. కానీ అది కూడా షరతులతోనట.
చండీగఢ్లోని అరుణ్ అనే ఆటో-రిక్షా డ్రైవర్ తన రిక్షాలో ప్రయాణించే ఎవరికైనా ఉచితంగా ఒక కిలో టమాటాలు అందజేస్తున్నాడు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు. మొదటి ఐదు రైడ్స్ లో ప్రయాణించే వారికేనని ఓ మెలిక పెట్టాడు. ఇది మాత్రమే కాదు.. అరుణ్ గత 12 సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులకు ఉచిత ఆటో-రిక్షా రైడ్లను అందిస్తున్నారు. అదనంగా, అతను గర్భిణీ స్త్రీలను ఉచితంగా ఆసుపత్రులకు కూడా తీసుకువెళ్తున్నాడు.
"ఇదే నా ఆదాయ వనరు... నేను జీవించే ఏకైక మార్గం. కానీ ఇలాంటి సేవలను అందించడం ద్వారా నాకు సంతృప్తిగా ఉంటుంది అని అరుణ్ చెప్పడం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతేకాదు, అతను చండీగఢ్లో ఐదు రోజుల పాటు ఈ ఉచిత రిక్షా రైడ్ను అందిస్తానని కూడా ప్రకటించాడు.
ALSO READ :Monsoon Food: ఈ వర్షాల్లో.. ఈ ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకుంటే హెల్దీ
ఇటీవల, పంజాబ్లోని గురుదాస్పూర్లోని ఒక షూ-స్టోర్ యజమాని తన కస్టమర్లకు కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చాడు. తన దుకాణంలో బూట్లు కొనుగోలు చేస్తే వారికి 2 కిలోల టమాటాలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రకటించారు. ప్రత్యేక సేల్ ఆఫర్ కింద, కస్టమర్లు రూ.1వెయ్యి నుంచి రూ.15వందల ధరల షూలను కొనుగోలు చేస్తే, వారు 2 కిలోల టమోటాలు ఉచితంగా పొందేందుకు అర్హులని చెప్పాడు. ఇక మధ్యప్రదేశ్లోనూ ఒక దుకాణదారుడు తన దుకాణంలో స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారికి ఉచితంగా టమాటాలు ఇస్తున్నాడు.
రిటైల్ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి, ఢిల్లీ-ఎన్సిఆర్, పాట్నా, లక్నో వంటి ఎంపిక చేసిన నగరాల్లో కేంద్రం టమాటాలను కిలోకు రూ.80 తగ్గింపుతో విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.