- మే 6 నుంచి ఎగ్జామ్స్
- 9.07 లక్షల మంది స్టూడెంట్లకు 1,443 పరీక్షా కేంద్రాలు
- బెంచీకి ఒక్కరికే చాన్స్
హైదరాబాద్,వెలుగు: ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఈ నెల 6 నుంచి 24 వరకు నిర్వహించనున్న క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ రూల్స్ ను పాటిస్తూ, బెంచీకి ఒక్కరే కూర్చునేలా పరీక్షా కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ సారి కూడా నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు మొత్తం 9,07,394 మంది స్టూడెంట్స్ అటెండ్ కానున్నారు. దీంట్లో ఫస్టియర్ కు 4,64,626 మంది, సెకండియర్కు 4,42,768 మంది అటెండ్ అవుతారు. వీరిలో 94,984 మంది ఒకేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 1,443 ఎగ్జామ్ సెంటర్స్ ఎంపిక చేయగా.. గవర్నమెంట్ కాలేజీల్లో 386, గవర్నమెంట్ సెక్టార్ కాలేజీల్లో 206, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 840 , స్కూళ్లలో 11 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ కోసం మొత్తం1,443 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లను నియమించారు. పరీక్షల నిర్వహణకు 25,513 మంది ఇన్విజిలేటర్లను ఎంపిక చేశారు. మాస్ కాపీయింగ్ను నిరోధించడానికి 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 150 సిట్టింగ్ స్క్వాడ్స్ రెడీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. కొవిడ్ ఎఫెక్ట్తో గత రెండేండ్లుగా సరిగా క్లాసులు జరగలేదు. దీంతో 70% సిలబస్తోనే పరీక్షలు నిర్వహిస్తుండటంతో పాటు క్వశ్చన్ పేపర్లలోనూ చాయిస్ను పెంచారు. ఫస్టియర్, సెకండియర్లోనూ ఎంపీసీ స్టూడెంట్లు ఎక్కు వ మంది పరీక్షలకు అటెండ్ కానున్నారు.
వెబ్ సైట్లో హాల్ టికెట్లు: ఉమర్ జలీల్
ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన హాల్టికెట్లను https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ సూచించారు. హాల్ టికెట్ పై పేరు, ఫొటో, సంతకం, మీడియం, సబ్జెక్టులు వంటి అంశాలను పరిశీలించి, తప్పులేమైనా ఉంటే వెంటనే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొని పోయి డీఐఈఓ ద్వారా వాటిని సరిచేసుకోవాలన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై కాలేజీ ప్రిన్సిపల్ పేరు లేకున్నా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారని చెప్పారు.