
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గిరిజన పిల్లల పోషకాహార స్థాయిని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా అధికారులు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎటపల్లిలోని తోడ్సా ఆశ్రమ పాఠశాలలో కృత్రిమ మేధస్సు ఏఐ ఆధారిత యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెషిన్ ముందు విద్యార్థి నిలబడగానే ప్లేట్ లో ఉన్న ఫుడ్ను ఫోటో తీస్తుంది. ఆ తర్వాత కొన్ని సెకన్లలోనే ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా ఆహారం నాణ్యతను గుర్తిస్తుంది.
భామ్రాగడ్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ప్రస్తుతం ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. బాలికల ఆశ్రమ పాఠశాలకు తాను వచ్చినప్పుడు వారికి పోషకాహారం లేదని భావించానని, 222 మందిలో 61 మంది బాలికలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని కనుగొన్నామని ఎటపల్లి అసిస్టెంట్ కలెక్టర్, సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ శుభం గుప్తా తెలిపారు. ఇక్కడ రోజుకు మూడుసార్లు భోజనం అందించబడుతుందన్న ఆయన..- అల్పాహారం, భోజనం, రాత్రి భోజనంతో మెనుని ఫాలో అవుతామని ఆయన చెప్పారు.
ఈ మెషిన్ ను ఓ NGO స్టార్టప్ రూపొందించిందని, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుందని గుప్తా తెలిపారు. ఈ యంత్రం ఆహారం క్వాంటిటీ మాత్రమే కాకుండా నాణ్యతను మెరుగుపరచడంలోనూ సహయపడుతుందని చెప్పారు. ఇక్కడ సేకరించిన డేటాను హెడ్మాస్టర్, తాను యాక్సెస్ చేయడానికి అవకాశముంటుందన్న ఆయన.. ఈ పద్ధతిని ఇప్పటివరకు 8 ఆశ్రమ పాఠశాలల్లో ఇన్స్టాల్ చేశామని స్పష్టం చేశారు. దీని ఫలితాలు చాలా సానుకూలంగా ఉన్నాయన్న ఆయన.. సెప్టెంబర్ 2022లో దీన్ని ఇన్స్టాల్ చేసినట్టు గుప్తా వెల్లడించారు. అప్పటి నుండి ఆహార నాణ్యత మెరుగుపడిందని వివరించారు.