
- తెలంగాణ ప్రభుత్వ జీవో 33కు సమర్థన
- 9,10,11, 12 తరగతులు రాష్ట్రంలో చదివితేనే ‘లోకల్’ అవుతారని తీర్పు
- గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు
- సివిల్ సర్వీస్, పారామిలిటరీ, డిప్యూటేషన్పై వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు వరుసగా 9, 10, 11, 12 తరగతులను తెలంగాణలోనే చదివి ఉండాలని, అప్పుడే స్థానికత వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అందులో భాగంగా స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 33ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. అలాగే తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.
మెడికల్ కోర్సు అడ్మిషన్లలో స్థానికతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 33పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు వర్సిటీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేశాయి. ఈ పిటిషన్లపై గత నెల 5న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కె వినోద్ చంద్రన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు సుమారు రెండు గంటలు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
సోమవారం ఈ పిటిషన్లపై 32 పేజీలతో కూడిన తీర్పును సీజేఐ ధర్మాసనం వెలువరించింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, 2017లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ నిబంధనలను సమర్థించింది. అలాగే 2024లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణను సమర్థించింది. అయితే.. గతేడాది స్థానికత అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి సీట్లు పొందిన విద్యార్థులకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది.
ఇవీ ప్రత్యేక సడలింపులు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. వారి ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతంలో పనిచేయాల్సి వస్తే.. వారి పిల్లలు ఆ ప్రాంతంలో 9,10,11,12 తరగతులు చదివి ఉంటే వారికి మినహాయింపు ఇస్తారు.
- ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసెస్లో తెలంగాణ కేడర్కి చెందిన అధికారులు – తెలంగాణ వెలుపల విధులు నిర్వర్తించిన కాలానికి తగ్గట్టుగా మినహాయింపు ఉంటుంది.
- రక్షణ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో పనిచేసే తెలంగాణా సిబ్బంది.. స్వస్థలంగా తెలంగాణను డిక్లేర్ చేసి ఉంటే, ఆ కాలానికి తగ్గట్టుగా వారి పిల్లలకు మినహాయింపు ఉంటుంది.
- తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని కార్పొరేషన్లు/ఏజెన్సీల్లో పనిచేసే వారు బదిలీలతో రాష్ట్రం బయటవిధులు నిర్వర్తిస్తే.. ఆ కాలంలో వారి పిల్లలు అక్కడ చదువుకొని ఉంటే మినహాయింపు లభిస్తుంది.
ఇదీ కేసు నేపథ్యం
మెడికల్ కోర్సు అడ్మిషన్లలో స్థానికతకు సంబంధించి నీట్ ఎగ్జామ్కు ముందు నాలుగేండ్లు స్థానికంగా చదవాలని నిబంధన చేర్చుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ కు చెందిన కల్లూరి అభిరామ్ తో పాటు మరో 160 మంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. విద్యార్థులకు ఫేవర్గా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ 11న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ రూల్స్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి ప్రకారం జారీ చేయబడిన 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 33 నిబంధనలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అలాగే ఆల్ ఇండియా కోటాలో 15 శాతం సీట్లు కేటాయించడాన్ని కూడా స్వాగతించింది. అలాగే ప్రభుత్వం రూల్ 3 కింద చేసిన సవరణలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. తద్వారా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక సడలింపులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.