మేడ్చల్, వెలుగు : హామీలను నెరవేర్చని మంత్రి మల్లారెడ్డిని ఎన్నికల్లో ఓడించి మేడ్చల్ నుంచి తరిమికొట్టాలని ఆ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ పిలుపునిచ్చారు. మేడ్చల్ సెగ్మెంట్లో వజ్రేశ్యాదవ్ ఎన్నికల ప్రచార జోరును పెంచారు. శనివారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి 18వ వార్డులో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రేశ్యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి అవినీతిని జనాలకు వివరించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, బీసీ బంధు ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా బీఆర్ఎస్ సర్కారు జనాలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కేసీఆర్ను, మేడ్చల్ నుంచి మల్లారెడ్డిని జనం తమ తీర్పుతో తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు మలిపెద్ది సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.