ఎమ్మెల్యే రాజయ్య అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్

ఎమ్మెల్యే రాజయ్య అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్
  • రెండు రికార్డింగ్స్​తో పోలీసులకు మళ్లీ కంప్లైంట్ ఇచ్చిన నవ్య
  • సరైన సాక్ష్యాధారాలు లేవన్న  ధర్మసాగర్​ సీఐ రమేశ్

హనుమకొండ, ధర్మసాగర్​, వెలుగు: స్టేషన్​ ఘన్​పూర్  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు తన అనుచరులపై  పోలీస్​ కంప్లైంట్​ ఇచ్చినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్​ వస్తున్నాయని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్​ నవ్య ఆరోపించారు.  బెదిరింపు కాల్స్ వస్తున్న రెండు నెంబర్లు, వాటికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్​తో ఆదివారం ఆమె ధర్మసాగర్​ సీఐ ఒంటేరు రమేశ్​కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన  ఓ వ్యక్తి  నుంచి వస్తున్న కాల్స్ భరించలేకపోతున్నానని,  తనకు ప్రాణభయం  ఉందని    ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, సర్పంచ్​ నవ్య  రెండు సార్లు ఫిర్యాదు చేయగా.. అందులో ఎఫ్​ఐఆర్​ కంటెంట్​ లేదని, అందుకే ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడం లేదని ధర్మసాగర్​ సీఐ రమేశ్​ స్పష్టం చేశారు.  పిటిషన్​లో  ప్రైమరీ సాక్ష్యాధారాలు లేకపోతే ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేమని, నవ్య దంపతులు  ఇచ్చిన పిటిషన్​ లో కూడా ఎలాంటి ఆధారాలు లేవన్నారు.  కాగా,  కేసు నమోదు చేయకపోవడంపై నవ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, తమ లాయర్​ తో మాట్లాడి ఈ ఘటనపై పోరాడుతామని స్పష్టం చేశారు.