ముగ్గురు చైన్ స్నాచర్లు అరెస్ట్

ముగ్గురు చైన్ స్నాచర్లు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: జల్సాలు, ఇతర అవసరాల కోసం చైన్​స్నాచింగులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మేడ్చల్​ డీసీపీ కోటిరెడ్డి శుక్రవారం వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అన్నారానికి చెందిన మస్కూరీ అరుణ్​కుమార్​(28) మూడు సంవత్సరాల క్రితం బ్యాంక్​లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు.

 ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సూరారం పోలీస్​ స్టేషన్​ పరిధి రాజీవ్​గాంధీనగర్​లో ఓ మహిళ మెడలోంచి పుస్తెల తాడు లాక్కొని పారిపోయాడు. కొంపల్లికి చెందిన తూళ్ల నిరంజన్​ రెడ్డి(27) ఆన్ లైన్​  బెట్టింగ్​లకు అలవాటుపడ్డాడు. 

ఈ నెల 7న మచ్చబొల్లారం, సిద్ధివినాయక్​నగర్​ ప్రాంతానికి చెందిన లక్ష్మమ్మ మెడలో రెండు తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు.  మెదక్​ జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన నీరుడు భూమయ్య(21) చింతల్​లో నివాసముంటూ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. 

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను ఎంచుకున్నాడు. గాగిల్లాపూర్, నారాయణాద్రి లేఅవుట్​లో ఇంటివద్ద ఉన్న ఓ మహిళ మెడలోంచి 2.5 తులాల పుస్తెలతాడు దొంగలించాడు. ఈ ముగ్గురు నిందితులను శుక్రవారం వేర్వేరుగా పోలీసులు పట్టుకుని రిమాండ్​కు తరలించారు.