- మృతుల్లో భార్య, భర్త, కొడుకు
- భార్య ఎనిమిది నెలల గర్భిణి
- హైదరాబాద్ లోని ఇబ్రహీంబాగ్ వద్ద ప్రమాదం
మెహిదీపట్నం, వెలుగు: బైక్ ను ఇసుక లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం దోమ ప్రాంతానికి చెందిన గోపాల్ (29) మేస్త్రీ పని చేస్తున్నాడు. కొంత కాలంగా గండిపేట మండల పరిధిలోని మంచిరేవుల గ్రామంలో తన భార్య రేణుక(25), కొడుకు అర్జున్ (13 నెలలు) తో కలిసి ఉంటున్నాడు. రేణుక 8 నెలల గర్భిణి. గురువారం ఆమెను గోల్కొండ హాస్పిటల్ లో చూపేందుకు గోపాల్.. తన కొడుకు అర్జున్ తో కలిసి బైక్ పై బయల్దేరాడు.
ఈ క్రమంలో ఇబ్రహీంబాగ్ వద్ద ఇసుక లారీ అతని బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అర్జున్ అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడిన భార్యాభర్తలను పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల బంధవుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇబ్రహీంబాగ్ వద్ద స్పీడ్ బ్రేకర్ వేయాలని గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.