తిరువనంతపురం: అనంత పద్మనాభస్వామి ఆలయంలో విలువైన బంగారం, వెండి వస్తువులు గల్లంతయ్యాయని , భద్రతా లోపాలు ఉన్నాయని మీడియాలో వస్తున్న వార్తలను ఆలయం యాజమాన్యం తోసిపుచ్చింది. అవన్నీ నిరాధారం, అసత్యం అని స్పష్టం చేసింది. విలువైన వస్తువులు అదృశ్యం కావదం, భక్తుల కానుకల నిర్వహణ, భద్రతా ఉల్లంఘటనపై ఆరోపణలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీసి, ప్రజలను తప్పుదోవ పట్టించే దురుద్దేశ ప్రయత్నాలని కొట్టిపారేసింది. అనంత పద్మనాభస్వామి ఆలయ సంపదలు అత్యున్నత భద్రతా ప్రమాణాలతో, భక్తిశ్రద్ధలతో సంరక్షించబడుతున్నాయి అని స్పష్టం చేసింది.
ఆలయ ప్రాంగణం పోలీసులతో భారీ భద్రత ఉందని, సీసీటీవీ నిఘాలో ఉందని తెలిపింది. అవసరమైనపుడు విలువైన వస్తువుల తరలింపును భద్రతా అధికారులకు ముందుగా తెలిపి, వారి సమక్షంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు,బయటకు వెళ్లేటప్పుడు సిబ్బందిని తనిఖీ చేస్తారని, దొంగతనం లేదా దుర్వినియోగం జరిగినట్లు ఎటువంటి ఘటన జరగలేదని క్లారిటీ ఇచ్చింది. నిరాధారమైన వదంతులతో భక్తులు, ప్రజలు నమ్మొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
