షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో పర్మిషన్ లేకుండా నడుస్తున్న మూడు ప్రైవేటు క్లినిక్లను వైద్యాధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తూరుకు చెందిన పూజ అనే మహిళకు ఈ నెల 5న పేట్లబురుజులోని ఆస్పత్రిలో డెలివరీ కాగా.. 6న ఇంటికి వచ్చింది.
అయితే, ఈ నెల 13న ఆమెకు కడుపునొప్పి రావడంతో కొత్తూరులోని సాయిబాబా క్లినిక్కు వెళ్లింది. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జయలక్ష్మీ ఆదేశాల మేరకు అధికారులు సాయిబాబా క్లినిక్తో పాటు జహంగీర్ పాషా, నేహా క్లినిక్లను, వాటికి అనుబంధంగా నడుస్తున్న మెడికల్ షాప్లను సీజ్ చేశారు. ఆ మెడికల్ షాపుల్లో ఉన్న కాలం చెల్లిన మందులను డ్రగ్ ఇన్ స్పెక్టర్ సీజ్ చేశారు.