జనంలో ఉంటేనే టికెట్ .. పైసలు.. పైరవీల కాలం పోయింది

జనంలో ఉంటేనే టికెట్  ..  పైసలు.. పైరవీల కాలం పోయింది

పార్టీలో పెద్ద లీడర్లతో పైరవీ చేయించుకుంటేనో.. కోట్ల రూపాయలు ఇస్తేనో ఎమ్మెల్యే టికెట్ వచ్చే కాలం పోతున్నది. ‘పైసలు అందరి దగ్గర ఉంటున్నయ్.. అవసరమైతే పార్టీ నుంచి ఎంతో కొంత ఇద్దాం.. కానీ, ఎవలు గెలుస్తరో వాళ్లకే టికెట్’​ ఇది ఇప్పటి కాలం. లీడర్లు కూడా ఆ రకంగానే ప్రయత్నం చేసుకునే పనిలో పడ్డారు. రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయనడానికి ఇదో ప్రధాన ఉదాహరణ అని పొలిటికల్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకు జాతీయ స్థాయి పార్టీ అయితే.. పైనోళ్లను పట్టుకుంటే టికెట్ ఈజీ అనుకునేలా గడిచింది. 

తెలిసినోళ్లతో చెప్పించుకోవాలి.. అలా కాదంటే పార్టీకి ఎంత ఫండ్ ఇస్తరనేది ఉంటుండే. ప్రాంతీయ పార్టీ అయితే.. ఏ మేరకు ఖర్చు పెట్టుకోగలుగుతారు? ఎంతో కొంత ఇచ్చుకుని అసెంబ్లీకి పోటీ చేసేందుకు సీటు కన్ఫమ్ చేసుకునేలా వ్యవహారాలు నడిచేవి. అయితే, ఈసారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్ని పార్టీలు టికెట్ల కోసం సర్వేలపైనే ఆధారపడుతున్నాయి. ఫలానా లీడర్.. ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తరా? లేదా? అనేదానిపైనే టికెట్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు లీడర్లు ముందు నుంచి ప్లాన్​ చేసుకుని సంబంధిత నియోజకవర్గంలో తిరుగుతూ కార్యక్రమాలు చేసుకున్నారు. టికెట్ ఆశించి అలా చేయని కొందరు.. సర్వేలే ఫైనల్ అని తెలిస్తే తాము అదే పనిచేసుకుంటుండే కదా అని వాపోతున్నారు.

వాళ్లను నమ్మి మోసపోయినం..

టికెట్ల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ కంప్లీట్​గా సర్వేనే ఆధారం చేసుకున్నది. అందులో భాగంగానే మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు సూచించిన పేర్లను కూడా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కన పెట్టేశారు. కొంతమంది లీడర్లు సీఎంకు దగ్గరగా ఉండేవాళ్లు ఎన్ని కోట్ల రూపాయలు అయినా ఇస్తామని.. టికెట్ వచ్చేలా చూడాలని కోరినా ఫలితం లేకుండా పోయిందని తెలిసింది. 

పైరవీ చేశామని.. సీటు కన్ఫర్మ్ చేయలేకపోయామని.. సీఎం సర్వేల ఆధారంగా ఫైనల్ చేశారని ఆ లీడర్లతో మంత్రులు చెప్పుకున్నట్లు తెలిసింది. ‘అదేదో తమకు ముందే చెబితే.. ఆయా నియోజకవర్గాల్లో ఏడాది, రెండేండ్ల నుంచే గట్టిగా తిరిగి ప్లాన్ చేసుకునేవాళ్లం కదా.. నమ్ముకుంటే ఇంత పని చేస్తరా’ అని సదరు మంత్రులపై తమ క్యాడర్ ​వద్ద ఆ లీడర్లు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఏడేనిమిది నియోజకవర్గాల లీడర్లు అదే పనిగా ఈ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

కాంగ్రెస్​లో​ నడుస్తున్న సర్వే 

ప్రస్తుతం కాంగ్రెస్​పార్టీలోనూ సర్వేల టైమ్ నడుస్తోంది. పీసీసీ చీఫ్, ఏఐసీసీలో కీలకంగా ఉన్న ఇతర లీడర్లను కలిసి సీటు కన్ఫర్మ్ చేసుకునేందుకు కొందరు లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నరు. అయితే వాళ్లకి కూడా తమదేం లేదని, సర్వే ఫైనల్ అంటున్నట్లు తెలిసింది. దీంతో గ్రౌండ్​లో సోషల్ మీడియాలో ప్రచారం చేయించడంతో పాటు.. పోటాపోటీ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. 

పార్టీ నుంచి టికెట్ రాకపోయినా సరే.. పోటీలో ఎట్లాగైనా ఉండాలని భావించిన ఆశావహులు ముందు నుంచే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నియోజకవర్గాల్లో తిరిగారు. అలా తిరగడం కలిసొచ్చిందని ఇప్పుడు ఆ కొందరు లీడర్లు భావిస్తున్నరు. దీంతో టికెట్ కన్ఫమ్ చేసుకునేందుకు పైరవీలు, పైసలు ఇయ్యాల్సి ఉంటుండేనని.. ఇప్పుడు నియోజకవర్గంలో ఏడాది.. రెండేండ్ల ముందు నుంచే కార్యక్రమాలు పెట్టి ఖర్చు చేస్తేనే సీటు వస్తుందని తెలిసొచ్చిందని అంటున్నారు.