సిద్దిపేట జిల్లాలో కలవర పెడుతున్న పులి సంచారం

 సిద్దిపేట జిల్లాలో కలవర పెడుతున్న పులి సంచారం
  •     అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు 
  •     ప్రత్యేకంగా మూడు టీంల ఏర్పాటు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో పులి సంచారం ప్రజలను కలవరపెడుతోంది. బుస్సాపూర్​లో పులి పాదముద్రలు కనిపించగా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సిద్దిపేట, మిరుదొడ్డి, కొండాపూర్, తొగుట మండలాలు, వరదరాజుపల్లి, గోవర్ధనగిరి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నటు అటవీ అధికారులు గుర్తించారు.  

రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఫారెస్ట్ అధికారి సందీప్ కుమార్ మాట్లాడుతూ.. వరదరాజుపల్లి శివారులోని ఓ పొలంలో అనుమానాస్పదంగా పాదముద్రలు కనిపించగా అవి చిరుత పులివా లేదా ఇతర జంతువుల అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. 

ఇందుకోసం మూడు టీంలను ప్రత్యేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్టు వివరించారు. సిద్దిపేట మండలం తోర్నాల గ్రామం వైపు వెళ్లినట్టుగా గుర్తించి వెతుకుతున్నట్టు చెప్పారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని జీవాలను సాయంకాలం లోపే ఇంటికి తీసుకు వెళ్లాలని సూచించారు.