తిరుమలలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమలలో ఉన్న జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకోవడంతో పాపవినాశనం డ్యామ్ వద్ద ఆదివారం ( అక్టోబర్ 26) టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగ హారతి సమర్పించారు.
తిరుమలలోని జలాశయాలు 95 శాతం నిండటం శుభ పరిణామం అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు
భక్తుల కోసం తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుండగా తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యామ్ ల నుండి 25 లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు.
తిరుమలలో 250 రోజుల నీటి అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డ్యామ్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ శాఖను బీఆర్ నాయుడు అభినందించారు. టీటీడీ చరిత్రలో రికార్డుస్థాయిలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. గడిచిన 11 నెలల కాలంలో టీటీడీ ట్రస్టులకు రూ.918 కోట్లు విరాళాలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
