- ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
- పోలీసు, విజిలెన్స్ విభాగాలతో అదనపు భద్రత
తిరుమల, వెలుగు: ధార్మిక క్షేత్రమైన తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొత్తం 16 వాహనాలపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తకోటికి దర్శనమిస్తాడు. ఈ ఉత్సవశోభను తిలకించేందుకు దేశం నలుమూలలతోపాటు విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ యంత్రాంగం రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 1,600కు పైగా సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం 585 సీసీ కెమెరాలు ఉండగా, అదనంగా 1,051 ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ నిఘా సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా గరుడసేవతోపాటు బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల్లో వీరు వివిధ ప్రాంతాల్లో మఫ్టీలో విధుల్లో ఉంటారు. విజిలెన్స్, ఎస్టేట్, రెవెన్యూ అధికారులతో కూడిన ప్రత్యేక స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో అధిక ధరలను అరికడతారు. తిరుమల, తిరుపతి మధ్య ప్రైవేటు ట్యాక్సీల్లో ప్రయాణించే భక్తులకు రవాణా ఛార్జీలను ఒక్కొక్కరికి రూ.70-గా నిర్ణయించారు. గరుడసేవకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం లగేజీ కౌంటర్లను పెంచనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 29న అంకురార్పణం నిర్వహించనున్నారు.
వాహన సేవల వివరాలు
తేదీ ఉదయం రాత్రి
30-09-2019 ధ్వజారోహణం (సాయంత్రం) పెద్దశేషవాహనం
01-10-2019 చిన్నశేష వాహనం హంస వాహనం
02-10-2019 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
03-10-2019 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
04-10-2019 మోహినీ అవతారం గరుడ వాహనం
05-10-2019 హనుమంత వాహనం స్వర్ణరథం
06-10-2019 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-10-2019 రథోత్సవం అశ్వ వాహనం
08-10-2019 చక్రస్నానం ధ్వజావరోహణం