టైటానిక్‌‌ కరిగిపోతోంది..!

టైటానిక్‌‌ కరిగిపోతోంది..!

సముద్రం అడుగున తుప్పు, బ్యాక్టీరియా పట్టి ముక్కలవుతున్న ఓడ​

14 ఏళ్ల తర్వాత సంద్రం అడుగున టైటానిక్‌‌ వీడియో

అట్లాంటిక్​ మహా సంద్రం. నిశ్శబ్ద యుద్ధం చేస్తూ ఎగుస్తున్న అలల మధ్య టైటానిక్​ ప్రయాణం ప్రారంభించింది. నాలుగు రోజులు గడిచిందో లేదో, పెద్ద మంచు కొండ దాని దారికి అడ్డొచ్చింది. తప్పించేలోపు ఓడ ఢీకొట్టేసింది. 1912 ఏప్రిల్​ 15న ఆ మహా సంద్రం షిప్పును మింగేసింది. అప్పుడు షిప్పును మింగేసిన సంద్రమే, ఇప్పుడు తినేస్తోంది. అవును, 13 వేల అడుగుల లోతున (4 కిలోమీటర్లు) నిశ్శబ్దంగా సేద తీరుతున్న ఆ టైటానిక్​ షిప్పు ముక్కలవుతోంది. ఉప్పునీటి తుప్పు, ఇనుమును తినేసే బ్యాక్టీరియా టైటానిక్​ డెక్కును పట్టేసి కొన్ని భాగాలను తినేశాయి. 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా కలాడన్​ ఓషియానిక్​ అనే కంపెనీకి చెందిన డైవర్లు టైటానిక్​ దగ్గరకు వెళ్లారు. అట్లాంటిక్​ ప్రొడక్షన్స్​ అనే సంస్థ దానిపై డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో భాగంగానే కంపెనీ డైవర్లు 4కే రెజల్యూషన్​ కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీశారు.

1997లో దాని షిప్పు పరిస్థితిని, ఇప్పటి స్థితిని పోల్చి చూశారు. డెక్కు సైడ్​ భాగంలో పెద్ద రంధ్రం పడిందని, అది ముక్కలైపోతోందని నిర్ధారణకు వచ్చారు. ‘‘టైటానిక్​ షిప్పు ఇలా కరాబవడం షాక్​కు గురిచేసింది. ఇది మున్ముందు ఇలాగే కొనసాగుతుంది. షిప్పు నామ రూపాల్లేకుండా పోతుంది” అని టైటానిక్​ చరిత్రకారుడు పార్క్​ స్టీఫెన్సన్​ అన్నారు. టైటానిక్​ షిప్పులోని ఫేమస్​ కెప్టెన్​ బాత్​ టబ్​ ఇప్పుడు కనుమరుగైపోయిందని చెప్పారు. అయితే, టైటానిక్​ ఇలా కరాబైపోవడం సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియేనని సైంటిస్ట్​ లోరి జాన్సన్​ చెప్పారు. బ్యాక్టీరియా కమ్యూనిటీ మొత్తం ఒకే చోటకు చేరి ఓడ శకలాలను తినేస్తాయని వివరించారు. డాక్యుమెంటరీలో భాగంగా కెనడాలోని న్యూఫౌండ్​లాండ్​ వద్ద ఐదు సార్లు సముద్రం అడుగున ఉన్న టైటానిక్​ దగ్గరకు వెళ్లొచ్చారు డైవర్లు. బెల్​ఫాస్ట్​ అండ్​ వూల్ఫ్​ షిప్​యార్డ్​ ఈ షిప్పును తయారు చేసింది.