హైదరాబాద్​ అభివృద్ధి ఒక బూటకం : టీజేఏసీ

హైదరాబాద్​ అభివృద్ధి  ఒక బూటకం : టీజేఏసీ

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ ను దేశంలోనే నంబర్‌‌ వన్‌‌ గా తీర్చిదిద్దినట్లు బీఆర్‌‌ఎస్‌‌ సర్కారు చేసుకుంటున్న ప్రచారం అవాస్తవమని తెలంగాణ జాయింట్​యాక్షన్​కమిటీ(టీజేఏసీ) తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధిలో హైదరాబాద్​పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం కంటే దారుణంగా పడిపోయిందని, అందుకు ప్రభుత్వం విడుదల చేసిన పారిశ్రామిక విద్యుత్‌‌ వినియోగ వృద్ధిరేటు గణంకాలే సాక్ష్యాలని స్పష్టం చేసింది. 

టీజేఏసీ మీడియాకు ప్రకటించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అభివృద్ది అంటే ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉండాలి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్‌‌పీడీసీ‌‌ఎల్) పరిధిలో ఉన్నాయి. సదరన్‌‌ డిస్కం పరిధిలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం పరిశీలిస్తే.. హైదరాబాద్​లో జరిగిన అభివృద్ధి ఏమిటో స్పష్టమవుతుంది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో  మార్చి 31 నాటికి ఎస్‌‌పీడీసీ‌‌ఎల్ పరిధిలో పారిశ్రామిక వినియోగం 8,636 మిలియన్ యూనిట్లు. 

తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల తర్వాత 2021–-22 నాటికి ఎస్‌‌పీడీసీ‌‌ఎల్ పరిధిలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం12,759 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ ఎనిమిదేండ్లలో పరిశ్రమల కరెంటు వినియోగం వృద్ధి 47.70 % పెరిగింది. అలాగే 2005–06లో ఎస్‌‌పీడీసీ‌‌ఎల్ పరిధిలో పారిశ్రామిక విద్యుత్​ వినియోగం 4,938 మిలియన్ యూనిట్లు. రాష్ట్రం ఏర్పాటయ్యే 2013–14 ఆర్థిక సంవత్సరం నాటికి వినియోగం 8,636 మిలియన్ యూనిట్లు. 

ఈ 8 ఏండ్ల మధ్య కాలంలో సదరన్‌‌ డిస్కం ప్రాంత పారిశ్రామిక  విద్యుత్‌‌ వినియోగం వృద్ధి 74.90%కు పెరిగింది. దీన్ని బేరీజు వేసి చూస్తే  రాష్ట్రం సాధించుకున్న 8 ఏండ్లలో, ఎస్‌‌పీడీసీ‌‌ఎల్  పరిధిలో పారిశ్రామిక విద్యుత్‌‌ వినియోగం వృద్ధి రేటు(74.90% నుంచి)47.70%కు  పడిపోయిందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ ప్రాంత విద్యుత్‌‌ వృద్ధి రేటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దిగజారిందని టీజేఏసీ స్పష్టం చేసింది. 

వందేళ్ల క్రితమే దేశంలోనే నంబర్‌‌ వన్‌‌ 

హైదరాబాద్ వందేళ్ల క్రితమే దేశంలోనే విద్యుదీకరణ సాధించిన మొట్ట మొదటి నగరాల్లో ఒకటిగా ఉండేదని తెలంగాణ జేఏసీ పేర్కొంది. 1920 దశకంలోనే హైదరాబాద్​లో ఇండస్ట్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను నెలకొల్పినట్లు గుర్తు చేసింది. 1910లోనే ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డ్ స్థాపించారని, ఆ తర్వాత17  ఏండ్లకు అప్పటి ఆంధ్రా ప్రాంతం ఉన్న మద్రాస్ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏర్పాటైందని జేఏసీ బయట తెలిపింది. 

పారిశ్రామికరణ, ఉపాధి కల్పన సహా  హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు సాధించిన అభివృద్ధిని కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం కొనసాగించలేదని, విద్యుత్​వినియోగం వృద్ధి రేటు లెక్కలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని తెలంగాణ జాయింట్‌‌ యాక్షన్‌‌ కమిటీ వెల్లండించింది.