
హైదరాబాద్, వెలుగు : పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పాత పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ని ప్రైవేటు కంపెనీలకు తాకట్టుపెట్టే లక్ష్యంతో ఉందన్నారు. ప్రైవేటు కంపెనీలకు, కార్పొరేట్ వ్యవస్థలకు కేంద్రం రద్దు చేసిన రూ.లక్షల కోట్ల బ్యాంక్ బకాయిల సొమ్ము కంటే ఓపీఎస్ వల్ల వచ్చేది తక్కువేనన్నారు.
సీపీఎస్లో వసూలు చేసిన పెన్షన్ డబ్బులను కార్పొరేట్కు తాకట్టు పెట్టడానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వం ఈ డబ్బును వాడుకునేదని, ప్రస్తుతం దాన్ని మనమే వాడుకోవాలన్నారు. ఇతర ఆదాయ మార్గం లేని ఉద్యోగులు సీపీఎస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఏ మార్పుకోసం పోరాటం చేశారో ఆ ప్రభుత్వం వచ్చిందన్నారు. డైలీ అధికారుల దగ్గరికి వెళ్లడం తనకు కొత్తగా ఉందన్నారు.
కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయ, అనుబంధ సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడాలన్నారు. కేటీఆర్, హరీశ్రావు, కవిత, తెలంగాణ ప్రజలనుతప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సభాధ్యక్షుడు చంద్రశేఖర్, కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.