
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న విజయ్ నాయర్ ,అభిషేక్ రావు బెయిల్ను రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ పై స్పందించాలని విజయ్ నాయర్, అభిషేక్ రావు కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వారిద్దరి స్పందన ఆధారంగా ఇవాళ విచారణ జరుగుతుంది.
ఇక అంతకుముందు నవంబరు 14న విజయ్ నాయర్, అభిషేక్ రావులకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ ను రద్దు చేయాలని కోరింది. దీనిపై నవంబరు 24న విచారణ చేపట్టిన హైకోర్టు.. అందుకు అంగీకరించలేదు. బెయిల్ పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దానికి సంబంధించిన అంశంపైనే ఇవాళ కోర్టులో ఇరు పక్షాల వాదనలు కొనసాగనున్నాయి.
అభిషేక్రావుపై అభియోగాలు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్రావు సౌత్ లాబీ పేరుతో లావాదేవీలు కొనసాగించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఆ విధంగా వసూలు చేసిన రూ.3.80 కోట్లను హవాలా రూపంలో పలువురికి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. సమీర్ మహేంద్రుకు అభిషేక్.. హవాలా రూపంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు అభియోగాలు దాఖలు చేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులకు కూడా డబ్బులను హవాలా రూపంలో అభిషేక్ చెల్లించాడని ఆరోపించారు. ఇండో స్పిరిట్ యజమాని విజయ్ నాయర్, దినేష్ అరోరాతో కలిసి అభిషేక్రావు కుంభకోణానికి పథకం రచించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
విజయ్ నాయర్ ఎవరు?
లిక్కర్ స్కాంలో మొట్టమొదటి అరెస్ట్ విజయ్ నాయర్ దే. ఈ కేసులో ఏ5 నిందితుడుగా విజయ్ నాయర్ ఉన్నాడు. ఇటీవల ఈడీ విడుదల చేసిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులోనూ అతడి పేరు ఉంది. విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసేవాడు . అతడికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ఉన్న సంబంధం ఏమిటి ? ఢిల్లీ ప్రభుత్వం అతడిని ఎలా చూసుకుంది ? అనే అంశాలతో ముడిపడిన సమాచారాన్ని 32 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ ప్రస్తావించింది. దీని ప్రకారం.. “విజయ్ నాయర్ ఒక సాధారణ ఆప్ కార్యకర్త కాదు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడు. ఎంతగా సన్నిహితుడంటే అరవింద్ కేజ్రీవాల్ క్యాంప్ ఆఫీస్ నుంచే పనిచేసేంతగా!! 2020 సంవత్సరం నుంచే అరవింద్ కేజ్రీవాల్ క్యాంప్ ఆఫీస్ నుంచి విజయ్ నాయర్ తన కార్యకలాపాలు చక్కబెట్టుకునేవాడు. ఇదే సమయంలో ఢిల్లీ కేబినెట్ మంత్రి కైలాశ్ గెహ్లాట్ కు అధికారికంగా కేటాయించిన ప్రభుత్వ బంగ్లాలో విజయ్ నాయర్ నివసించేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ కేబినెట్ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఢిల్లీలోని నజఫ్ఘర్ ఏరియాలో ఓ ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకొని ఉండేవారు”అని ఈడీ రిమాండ్ రిపోర్టులో ఉంది. కాగా, విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ బాధ్యతలను చేపట్టకముందు ముంబై కేంద్రంగా పనిచేసే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ 'ఓన్లీ మచ్ లౌడర్' సీఈఓగా పనిచేసేవారు. ఇతను ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు సన్నిహితుడని అంటున్నారు.
రూ.100 కోట్ల ముడుపులు..
ఢిల్లీలోని లిక్కర్ షాపులకు మద్యం సరఫరా చేసే హోల్ సేల్ సంస్థలకు 12 శాతం లాభం మిగిలేలా అరవింద్ కేజ్రీవాల్ సర్కారు గత ఏడాది లిక్కర్ పాలసీని రూపొందించింది. అయితే ఇందులో దాదాపు 6 శాతానికి సమానమయ్యే మొత్తాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య లీడర్లకు హోల్ సేల్ లిక్కర్ సరఫరా సంస్థలు ముడుపులుగా చెల్లించాలనే రహస్య డీల్ కుదిరిందని రిమాండ్ రిపోర్టులో ఈడీ ప్రస్తావించింది. ఈ డీల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులకు ఇచ్చేందుకుగానూ ఎమ్మెల్సీ కవిత, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్ అరోరాలతో కూడిన సౌత్ గ్రూపు నుంచి విజయ్ నాయర్ కుదాదాపు రూ.100 కోట్ల ముడుపులు అందాయని ఈడీ పేర్కొంది.