చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప
తిరుపతి: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
చంద్రప్రభ వాహనం – సకలతాప హరం
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
వాహనసేవలో శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, శేఖర్ రెడ్డి, గోవిందహరి, డిపి అనంత, ఆలయ డెప్యూటి ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు.
శనివారం ఉదయం 7 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షిస్తారు.