
- లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్న తెలంగాణ, టీబీఐజీసీ ప్రతినిధులు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్– 2047’విజన్ అద్భుతంగా ఉందని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. 1997– 2007 మధ్య పదేండ్ల పాటు యూకేకు ప్రధానిగా, సుదీర్ఘకాలం ఇంగ్లండ్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన టోనీ బ్లెయిర్ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయకులకు విజన్, వ్యూహరచన.. వాటి అమలుకు సహకరించాలనే ఉద్దేశంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టీబీఐజీసీ)ను స్థాపించారు.
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్తో గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టోనీ బ్లెయిర్కు సీఎం రేవంత్ వివరించారు. మానవ అభివృద్ధి సూచికల్లో అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
పట్టణ, పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల వారీగా తాము అమలు చేయబోయే సూక్ష్మ ప్రణాళికను వివరించారు. తెలంగాణ రైజింగ్– 2047 ముఖ్య అంశాలను తెలియజేస్తూ, ఈ విజన్ను 2025, డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు వెల్లడించనున్నామని చెప్పారు. సుస్థిరాభివృద్ధి దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక ఉందని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు.
భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులపై టోనీ బ్లెయిర్ ఆసక్తి చూపారు. ఇరు నేతల భేటీ అనంతరం తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలులో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం, టీబీఐజీసీ ప్రతినిధులు ఉద్దేశ పత్రాన్ని (లేటర్ ఆఫ్ ఇంటెంట్) పరస్పరం మార్చుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఎస్సార్ ఏపీ జితేందర్ రెడ్డి, సమాచార, సాంకేతిక పారిశ్రామల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పారిశ్రామిక, వాణిజ్య విభాగం స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, టీబీఐజీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.