టోర్నడోల దెబ్బకు ఫ్యాక్టరీలు, ఇండ్ల పైకప్పులు, వెహికల్స్ తుక్కుతుక్కు

టోర్నడోల దెబ్బకు ఫ్యాక్టరీలు, ఇండ్ల పైకప్పులు, వెహికల్స్ తుక్కుతుక్కు
  • అమెరికాలో టోర్నడోల బీభత్సం
  • దాదాపు 100 మంది మృతి?
  • ఫ్యాక్టరీలు, ఇండ్ల పైకప్పులు, వెహికల్స్ తుక్కుతుక్కు 
  • కెంటకీలో 320 కి.మీ. పొడవునా భారీ విధ్వంసం 

ఫ్రాంక్ ఫోర్ట్ (యునైటెడ్ స్టేట్స్): అమెరికాలో టోర్నడోలు, తుఫానులు బీభత్సం సృష్టించాయి. ఓవైపు కుండపోత వానలు, మరోవైపు భారీ టోర్నడోలతో ఫ్యాక్టరీలు, ఇండ్ల పైకప్పులు, షెడ్లు ఎగిరిపోయాయి. రోడ్లు, వీధుల్లోని వెహికల్స్ తుక్కుతుక్కుగా మారాయి. ఒక్క కెంటకీ స్టేట్ లోనే 320 కిలోమీటర్ల పొడవునా భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. టోర్నడోల ధాటికి వివిధ రాష్ట్రాల్లో దాదాపు 100 మంది వరకూ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. కెంటకీలోనే టోర్నడో ధాటికి దాదాపు 50 మంది మృతిచెంది ఉండొచ్చని గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. కెంటకీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం కలిగించిన టోర్నడో ఇదే కావచ్చని అన్నారు. టోర్నడో ధాటికి మేఫీల్డ్ సిటీలోని క్యాండిల్ ఫ్యాక్టరీ పైకప్పు ఎగిరిపోయిందని, శిథిలాలు మీద పడటంతో చాలా మంది చనిపోయారని తెలిపారు. స్టేట్ అంతటా అతలాకుతలం కావడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించామన్నారు. 

వివిధ రాష్ట్రాల్లో భారీ తుఫానుల కారణంగానే బలమైన టోర్నడోలు ఏర్పడినట్లు గవర్నర్ తెలిపారు. శుక్రవారం ఇలినాయీని ముంచెత్తిన తుఫాను, టోర్నడో కారణంగా ఎడ్వర్డ్స్ విల్లేలోని అమెజాన్ కంపెనీ వేర్ హౌస్ కూడా ధ్వంసమైందన్నారు. అర్కాన్సాస్ లో ఓ నర్సింగ్ హోం, ఇతర ప్రాంతాల్లోని అనేక ఇండ్లు కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అమెజాన్ కంపెనీ యూనిట్ పైకప్పు రెండుగా చీలిపోగా, సుమారు 100 మంది వర్కర్లు రాత్రంతా శిథిలాల మధ్య చిక్కుకుపోయారని చెప్పారు. కాగా, టోర్నడో బీభత్సానికి సంబంధించిన దృశ్యాలను లోకల్ టీవీ చానెళ్లు ప్రసారం చేయగా, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.