ప్రకృతి వనరులు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే మావోయిస్టులపై దాడులు: మహేష్ గౌడ్

ప్రకృతి వనరులు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే మావోయిస్టులపై దాడులు: మహేష్ గౌడ్

హైదరాబాద్: ప్రజాస్వామ్య భారత దేశంలో ప్రజలందరికి జీవించే హక్కు ఉందని.. కానీ కేంద్రం ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. దేశంలో ఏ రకమైన హింసను కాంగ్రెస్ పార్టీ సమర్ధించదని స్పష్టం చేశారు. హైదరాబాద్‎లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్లపై ఆదివారం (జూన్ 1) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. దేశంలోని ఒక్క శాతం ధనికుల చేతుల్లో ప్రభుత్వాలు ఉండకూడదనేదే నక్సలిజం లక్ష్యమన్నారు. 

పటేల్, పట్వారి విధానాలతో దేశంలో నక్సలిజం పాత్ర క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుందన్నారు. బీజేపీ హయాంలో అత్యధిక సంఖ్యలో మావోయిస్టులపై దాడులు చేసి హతమార్చారని అన్నారు. ప్రజా ఉద్యమాలలో ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప మావోయిస్టులు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ చర్యల్లో అసువులు బాశారని పేర్కొన్నారు. కర్రెగుట్టలల్లో మావోయిస్టులపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. 

ప్రకృతి వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనే నెపంతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై దాడులుగా చేయిస్తోందే తప్ప.. అక్కడ శాంతి భద్రతల సమస్యలు పెద్దగా లేవన్నారు. మావోయిస్టులపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య దేశంలో ఖండించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు. కర్రెగుట్టల్లో భారీ ఆయుధాలతో చేస్తున్న నరమేధాన్ని అరికట్టి.. శాంతి చర్చలకు మావోయిస్టులకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉందని అన్నారు. 

ALSO READ | మావోయిస్టుల పేరుతో సాధారణ ప్రజలను కాల్చి చంపుతున్నరు: MLC కోదండరాం

సమాజంలో మావోయిస్టు పార్టీల మనుగడ ఉండాలని.. అప్పుడే దేశం సరైన మార్గంలో ముందుకు సాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేసిన నీచ చరిత్ర బీజేపీదని ఫైర్ అయ్యారు. సమాజంలో దేవుడు, మతం, కులం పేరుతో బీజేపీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.