- గ్రూప్2 ప్రిపరేషన్కు టైమ్ ఇవ్వకుండా అగ్నిపరీక్ష పెడుతుండు: రేవంత్
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా సీఎం కేసీఆర్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేండ్లు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగ అభ్యర్థులకు అగ్నిపరీక్ష పెడుతున్నారని ఫైర్ అయ్యారు. గ్రూప్2ను సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా ఎగ్జామ్ పెడుతున్నారని, వెంటనే పరీక్షను వాయిదా వేయాలని గురువారం ట్విట్టర్లో డిమాండ్ చేశారు.
ఎగ్జామ్ వాయిదా వేయాలన్న లక్షలాది మంది అభ్యర్థుల డిమాండ్పై సర్కారు స్పందించాలని కోరారు. లేకపోతే అభ్యర్థుల తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రూప్2 అభ్యర్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని రేవంత్ ఖండించారు.
అభ్యర్థులకు మద్దతు తెలిపితే.. ప్రజల పక్షాన ఆలోచించాల్సిన పాలకులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి నియంతలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్ను పోలీసులు మఫ్టీలో వచ్చి ఎక్కడికో తీసుకెళ్లారని ఆరోపించారు. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్నూ అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారని తెలిపారు. అభ్యర్థుల తరఫున పోరాడుతున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు.