
రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు సాండ్, ల్యాండ్, మైన్ లను ఆదాయ వనరుగా చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇసుక దోపిడీకి పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిని అంతమొందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబమే ఈ దోపిడీకి పాల్పడుతున్నదన్నారు. నెరేళ్ళలో ఇసుక మాఫియాను అడ్డుకున్న రైతులను డ్రామారావు పోలీసులతో ఎలా చిత్రహింసలు పెట్టారో చూసామని చెప్పిన రేవంత్.. మానేరు వాగులో జరుగుతున్న ఇసుక దోపీడీని పరిశీలించేందుకే ఇక్కడికి వచ్చామని వెల్లడించారు. జోగినపల్లి సంతోష్, అతని తండ్రి రవీందర్ రావు బినామీ పేర్లతో వందల కోట్ల దోపీడీకి పాల్పడుతున్నారు. ఒకే పర్మిట్ తో నాలుగు లారీల్లో ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. ఈ దోపిడీని బాహ్య ప్రపంచానికి చూపించేందుకే ఇక్కడకు వచ్చామని వ్యాఖ్యానించారు.
50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ సంపదను కాపాడి రైతులకు మేలు చేసిందని రేవంత్ అన్నారు. ఇసుకను తీయడానికి జేసీబీలను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. అధికారులతో చర్చిద్దామనుకుంటే ఒక్క అధికారి లేడని.. ఇసుక డంప్ లు ఉన్న ఈ ప్రాంతాన్ని అధికారులు పర్యవేక్షించాలని కోరారు. ఇది ఒక ప్రయివేటు సామ్రాజ్యంగా మారిందని.. ఇసుక తరలింపును అడ్డుకున్నవారిని పోలీసులు హెచ్చరించారని ఇక్కడి రైతులు చెబుతున్నారు. పోలీసులు ఇసుక మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. పిర్యాదు చేసిన వారిపైనే వారు చర్యలకు పాల్పడుతున్నారు.ఈ దోపిడీతో కేసీఆర్ కు ఉన్న చీకటి అనుబంధం ఏమిటో తేలాలని డిమాండ్ చేశారు. ఇది ఇలాగే సాగితే ఇక్కడి ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రభుత్వ అక్రమ అనుమతులు రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని రేవంత్ హెచ్చరించారు.