హైదరాబాద్, వెలుగు:
మెటీరియల్ అందించిన కంపెనీ నుంచి బిల్లుమొత్తం వచ్చే వరకు ఆగకుండా ఎంఎస్ఎంఈలకు (చిన్న, మధ్యతరహా ఇండస్ట్రీలు) తమ సంస్థ ద్వారా అదే మొత్తానికి లోన్ పొందవచ్చని ట్రేడ్ రిసీవబుల్ (టీఆర్ఈడీఎస్) ప్లాట్ఫారమ్ ఎం1 ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. ఇది పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుందని, కాగితాలు, కొలేటరల్ అవసరమే ఉండదని సంస్థ నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ మాథ్యూ కురియన్ చెప్పారు. హైదరాబాద్లో సోమవారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. ‘‘కంపెనీ నుంచి ఎంఎస్ఎంఈలకు బిల్ రావడానికి 45–90 రోజుల వరకు గడువు ఉంటుంది. మధ్యతరహా ఇండస్ట్రీలకు బిల్లింగ్ సైకిల్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎంఎస్ఎంఈలు ఆర్థికంగా బలంగా ఉండవు కాబట్టి డబ్బు కోసం అంతకాలం వరకు ఆగడం కష్టం. ఈలోపు ఎం1 ఎక్స్ఛేంజ్ నుంచి ఇవి మా ప్లాట్ఫారమ్ సాయంతో బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం ఇవి ఎం1లో రిజిస్టర్ కావాలి. ఎంఎస్ఎంఈలు బిల్స్ను మా ఎక్స్ఛేంజ్లో అప్లోడ్ చేయాలి. వాటిని బ్యాంకులు చూసి లోన్లను ఆఫర్ చేస్తాయి.
అతి తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకు నుంచి ఎంఎస్ఎంఈ 72 గంటలలోపే లోన్ తీసుకోవచ్చు. బిల్లింగ్ సైకిల్ ముగిసిన తరువాత కంపెనీయే (మెటీరియల్ తీసుకున్నది) లోన్ కడుతుంది. వడ్డీ మాత్రం ఎంఎస్ఎంఈ భరిస్తుంది. మామూలుగా ఎంఎస్ఎంఈలు బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే చాలా వడ్డీ కట్టాలి. మా ఫ్లాట్ఫామ్లో చాలా తక్కువ వడ్డీ ఉంటుంది. ఎం1 ఎక్స్ఛేంజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని 26 లక్షల ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుంది. తెలంగాణ నుంచి 500, ఏపీ నుంచి 250 ఎంఎస్ఎంఈలు మా కస్టమర్లు. 23 కంపెనీలు కూడా రిజిస్టర్ అయ్యాయి. మెజారిటీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మా ద్వారా లోన్లు ఇస్తాయి. ఇప్పటి వరకు రూ.33 వేల కోట్ల బిజినెస్ జరిగింది”అని రాయ్ వివరించారు.