
భారత్ జోడో యాత్ర రేపు హైదరాబాద్లో జరగనున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. దీనిని వాహనదారులు గమనించాలన్నారు. మధ్యాహ్నం 3 గంటలు నుండి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. పురణాపుల్, ముసబౌలి, లాడ్ బజార్, చార్మినార్ మీదుగా మాదిన, నాంపల్లి, ఐమాక్స్ రోటరీ,నెక్లెస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుందని, చార్మినార్ వద్ద రాహుల్ పతాకాన్ని ఎగరవేస్తారన్నారు. అఫ్జల్గంజ్, మొహంజాయి మార్కెట్, గాంధీభవన్, పోలీస్ కంట్రోల్ రూమ్, రవీంద్రభారతీ, ఆర్బీఐ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మీదుగా పాదయాత్ర ఉంటుందని సీపీ వెల్లడించారు.
ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్ ఉంటుందని సీపీ రంగనాథ్ తెలిపారు. పాదయాత్ర జరిగే మూడు కిలోమీటర్ల రేడియస్లో ఉండకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని సూచించారు. ఆర్టీసీ బస్సులను సైతం డైవర్ట్ చేస్తున్నామని, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించాలని సూచిస్తున్నమన్నారు. పలు నియోజకవర్గాల నుండి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులకు పార్కింగ్ లు కేటాయించామని తెలిపారు. చార్మినార్, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీపీ తెలిపారు. చార్మినార్ వద్ద మూడు గంటలు నుండి ప్రోగ్రాం మొదలవుతుందని, ఐమాక్స్ వద్ద 8.30 గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుందని, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశామని సీపీ వెల్లడించారు.