- మెట్రో పనుల శంకుస్థాపన కారణంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్
- రేసింగ్ లీగ్ నేపథ్యంలో ఖైరతాబాద్, నెక్లెస్రోడ్, ఎన్టీఆర్ మార్గ్లో ఆంక్షలు
- డైవర్షన్లతో ఇబ్బందిపడ్డ వాహనదారులు
హైదరాబాద్,వెలుగు: ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, మరోవైపు ఇండియన్ రేసింగ్ లీగ్కు ఏర్పాట్లు, మెట్రో పనలు శంకుస్థాపన కారణంగా శుక్రవారం గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ జామ్ నెలకొంది. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ భవన్లో జరిగిన సీఎం మీటింగ్తో ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిరంతరం వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ నం.12, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ జంక్షన్ సహా పంజాగుట్ట రోడ్లలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా సీఎం కేసీఆర్ సహా మంత్రులు,పార్టీ నేతలు పెద్దసంఖ్యలో బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ భవన్కు వచ్చారు. దీంతో బసవతారకం హాస్పిటల్ నుంచి టీఆర్ఎస్ భవన్ వరకు వెహికల్స్ రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వెహికల్స్ దారి మళ్లింపు..
శని, ఆదివారాల్లో జరగనున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం 11 గంటల నుంచే ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్స్ చేశారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్,తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను దారి మళ్లించారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మినహా మిగతా రూట్లను ఓపెన్ చేశారు. దీంతో పంజాగుట్ట నుంచి లక్డీకపూల్ వెళ్లే రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు ఖైరతాబాద్ క్రాస్రోడ్స్, షాదాన్ కాలేజ్, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, టెలిఫోన్ భవన్, లక్టీకపూల్, ఇక్బాల్ మినార్, అసెంబ్లీ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఎమ్మెల్యే బైక్ ర్యాలీతో..
మైండ్స్పేస్ జంక్షన్ వద్ద మెట్రో సెకండ్ ఫేజ్ పనుల శంకుస్థాపన నేపథ్యంలో హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సీఎం,మంత్రులు, వీఐపీల కాన్వాయ్లు రావడంతో ఉదయం 10 గంటల నుంచి ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ రోడ్లో వెహికల్స్ నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నిర్వహించిన బైక్ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో జూబ్లీహిల్స్ నుంచి సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ రూట్లో వాహనదారులు, ఐటీ ఎంప్లాయీస్ ఇబ్బందిపడ్డారు.