ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్.. అన్ని సేవలూ ఒకేచోట

ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్.. అన్ని సేవలూ ఒకేచోట

షాద్‌‌‌నగర్: ట్రిపుల్ రైడింగ్ చేస్తూనో, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూనో చాలా మంది పోలీసులకు చాలా మంది దొరికిపోతారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా డ్రైవ్ చేస్తూ చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్‌‌పై వాహనదారులకు మరింత అవగాహన తీసుకొచ్చేందుకు షాద్‌‌నగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సురక్షిత ప్రయాణం ఉంటే అన్నీ సాధ్యమనే నినాదంతో వాహనదారులకు ఒకే వేదిక వద్ద అన్ని సేవలను కల్పించారు.

డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లాంటి వాటి కోసం ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగకుండా అన్ని సేవలను ఒకే వేదిక వద్ద ఏర్పాటు చేశారు. రాయికల్ టోల్ ప్లాజా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఒకే చోట హెల్మెట్ లేని వారికి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి స్లాట్ బుకింగ్, నంబర్ ప్లేట్ లేని వారికి నంబర్ ప్లేట్, ఇన్సూరెన్స్ జారీ చేయడం లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీంతోపాటు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఈ సేవలు వారం రోజులపాటు కొనసాగనున్నాయని షాద్‌‌నగర్ ట్రాఫిక్ ఎస్‌‌ఐ రఘు కుమార్ అన్నారు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.