హైదరాబాద్ మియాపూర్లో అత్యంత దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను కాదని ప్రియుడి కోసం ఓ భార్య చేసిన ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చడమే కాకుండా.. ఎవరికీ అనుమానం రాకుండా హైడ్రామా ఆడింది ఓ కిరాతక భార్య.
అసలు ఏం జరిగిందంటే...2025 నవంబర్ నెలలో తన భర్త కనిపించడం లేదంటూ మహిళే స్వయంగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, రోజుల గడుస్తున్నా కేసులో ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు.. టెక్నాలజీ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు.
అనుమానితుల కాల్ రికార్డులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే భార్య కాల్ డేటాలో కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు, తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడి షాక్కు గురిచేసింది. ప్రియుడితో కలిసి తానే భర్తను అంతమొందించినట్లు మహిళ ఒప్పుకుంది.
హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు నిందితులు ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ వేశారు. మృతదేహాన్ని రహస్యంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుంత తవ్వి శవాన్ని పూడ్చిపెట్టారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మియాపూర్ పోలీసులు మహారాష్ట్రకు చేరుకుని, స్థానిక పోలీసుల సహకారంతో గుంతలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
