
- మిలటరీ అడిగిన 360 ఎకరాలు ఇచ్చేందుకు సర్కారు రెడీ
- త్వరలోనే రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించనున్న బల్దియా
- మారేడుపల్లి నుంచి ఆర్కే పురం దాకా
- 6 కి.మీ మేర నిర్మాణాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : కంటోన్మెంట్ మిలటరీ ఏరియాలో ప్రత్యామ్నాయ రోడ్లకు లైన్ క్లియరయ్యింది. సికింద్రాబాద్ ఏవోసీ(ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్) సెంటర్ కు వెళ్లకుండా ఆర్కేపురం చేరుకునే విధంగా బల్దియా రూ.600 కోట్లతో 6 కిలోమీటర్ల మేర 100 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. అలాగే, రెండు చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు.
కంటోన్మెంట్లో మిలటరీ భూమికి బదులుగా జీహెచ్ఎంసీ మరో చోట ప్రభుత్వ భూమిని అప్పగించాల్సి ఉండగా, మూడునెలలుగా ఇదే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ముందుగా రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లకు లెటర్లు రాయాలని జీహెచ్ఎంసీ భావించింది. అయితే, వందల ఎకరాలు కావడంతో వారు కూడా వెంటనే నిర్ణయం తీసుకోవడం కష్టమని భావించి కమిషనర్ నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సర్కారు కూడా వెంటనే స్పందించి ఓకే చెప్పింది.
త్వరలోనే మిలటరీ అడిగిన 360 ఎకరాల భూమిని వేరే ప్రాంతాల్లో అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ భూమిని అప్పగించిన వెంటనే జీహెచ్ఎంసీ పనులు మొదలుపెట్టనున్నది. ఇప్పటికే ఈ నిర్మాణాలని సంబంధించి మిలటరీ అధికారులతో బల్దియా కమిషనర్ పలుమార్లు సమావేశమయ్యారు.
ఆ ప్రాంతాల వారికి తప్పనున్న ఇబ్బందులు
మారేడ్ పల్లి నుంచి ఏవోసీ, మిలటరీ దవాఖాన రూట్నుంచి కాకుండా ఆల్టర్నేట్గా మారేడ్ పల్లి, సఫిల్ గూడ, ఆర్కేపురం ద్వారా కొత్త రోడ్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరంలో పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ రద్దీతో నిత్యం మిలటరీ ఏరియాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
రక్షణ పరంగా కూడా ఇది కీలకప్రాంతం కావడంతో రద్దీ తగ్గించాలని కొత్త రోడ్డు, రెండు ఫ్లై ఓవర్లు వేయాలని భావించారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి, నేరెడ్ మెట్, ఈసీఐఎల్ వెళ్లేవారికి ఈ ఉపయోగకరంగా ఉంటుంది. ఏవోసీ సెంటర్ లోపలకి వెళ్లకుండా బయటి నుంచి బయటకే వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇదే ప్రాజెక్టులో ఆర్ వోబీ, ఆర్ యూబీలు
మిలటరీ ఏరియాలో నిర్మించే ఈ రోడ్డు కి కనెక్టింగ్ గా ఆర్కేపురం వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి(ఆర్ వోబీ), రైల్ అండర్ బ్రిడ్జి(ఆర్ యూబీ)లను జీహెచ్ఎంసీ నిర్మించనున్నది. రెండు వైపుల నుంచి రాకపోకలు సాగించేందుకు సమాంతరంగా వీటిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం రూ.245 కోట్లకి పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది.
ఇందులో ఆర్ వోబీ కి రూ.210 కోట్లు కేటాయించగా, ఆర్ యూడీ కి రూ.35 కోట్లు ఇచ్చింది. అయితే, ఈ మొత్తం కంటే తక్కువలోనే నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. మారేడుపల్లి నుంచి కొత్తగా నిర్మించే రోడ్డుకి కనెక్టింగ్ కావడంతో ఆ పనులు మొదలుపెట్టే సమయంలోనే ఈ పనులు కూడా చేస్తే ఒకేసారి అన్ని పూర్తవుతాయని అధికారులు అంటున్నారు.